విశాఖలో  కన్నతండ్రే  కూతురిని చంపేశాడు. సొంత కూతురుని తండ్రి హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం  సెల్ఫీ వీడియో తీసుకుని తన కూతురిని తానే చంపేశానని వివరించాడు. దాన్ని సామాజిక మధ్యమాలలో అప్లోడ్ చేశాడు.. అసలేం జరిగిందంటే..  తండ్రి వడ్డాది ప్రసాద్. విశాఖ రెల్లివిధిలో నివాసం ఉంటున్న వడ్డాది ప్రసాద్ (42) భార్య హేమలత 13 సంవత్సరాల క్రితం భర్తను వదిలేసి వేరుగా ఉంటోంది. 13 సంవత్సరాల నుంచి ఇద్దరు ఆడపిల్లల్ని ప్రసాద్ పెంచాడు.


అయితే.. పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. తాజాగా రెండు రోజులు క్రితం చిన్న కూతురు కూడా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే మొన్న వన్ టౌన్ స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ చేసారు. అయినప్పటికీ  తన కూతురు మనసు మారలేదని ఆ తండ్రి సెల్ఫీ వీడియోలో చెబుతున్నాడు. కూతురు ప్రేమించిన వ్యక్తిపై కేసులు కూడా ఉన్నాయని తండ్రి నచ్చజెప్పాడు. అయినప్పటికి వినకపోవడంతో..ఆ కూతురుని చంపాలని నిర్ణయించుకున్నాడు.


మామూలుగా చెబితే రాదని.. ప్రసాద్ తల్లి చనిపోయిన రోజు కావడంతో కూతుర్ని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి తన చేతులతోనే కూతురుని చంపేశాడు. ఈ విషయం మొత్తాన్ని  ప్రసాద్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కూతురుని చంపిన అనంతరం అతడు ఆ విషయాన్ని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అవాక్కైన పోలీసులు ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు.


సొంత తండ్రే కూతురుని చంపిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. తల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లినా.. ఇద్దరు కూతుళ్లను పెంచిన తండ్రి ప్రేమ గొప్పదా.. 16 ఏళ్ల కే ప్రేమికుడితో  వెళ్లిపోయిన కూతురు ప్రేమ గొప్పదా అన్న చర్చ జరుగుతోంది. అయితే.. కూతురు ఎంత తప్పు చేసిందనుకున్నా.. ఏకంగా చంపాలన్న నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: