ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్లో రెండు ప్రధాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇవాళ పటాన్చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరగబోతున్నారు. వాటికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మ.2.10 గం.కు ఇక్రిశాట్ నుంచి హెలికాప్టర్లో శంషాబాద్కు చేరుకుంటారు.
సాయంత్రం 4.30 గంటలకు ఇక్రిశాట్ నుంచి ముచ్చింతల్కు రానున్న ప్రధాని మోడీ.. రాత్రి 7 గంటలకు శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ రాత్రి 8.05 గంటలకు యజ్ఞ పూర్ణాహుతిలో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8.20 గంటలకు ప్రధాని మోడీ దిల్లీకి తిరుగు పయనం అవుతారు. అయితే ప్రధాని, రాష్ట్రపతి వంటి దేశాధినేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వారిని విమానాశ్రయంలో ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.
మరి ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా.. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు సీఎం కేసీఆర్ శంషాబాద్ వెళ్తారా లేదా అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ రాజకీయాలు ముదిరిపోయాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను జైళ్లో వేయించడం.. దీనికి నిరసనగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించడం ఈ రెండు పార్టీల ఘర్షణ వైఖరికి దారి తీశాయి.
మొన్నటికి మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. బీజేపీ పాలనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మరి ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ.. ఇద్దరూ రెండు కార్యక్రమాల్లో ఒకేరోజు పాల్గొనడం ఆసక్తి రేపుతోంది. మరి వీరిద్దరూ ఎడ మొగం పెడ మొగం అన్నట్టుగా ఉంటారా.. లౌక్యంతో పైపై నవ్వులతో కార్యక్రమం కానిచ్చేస్తారా.. అన్నది చూడాలి.