
దీనిపై స్పందించిన మావోయిస్టు రాధిక ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నానన్న మావోయిస్టు రాధిక.. రాధిక అనే నేను నర్సింగ్ విద్యార్థినే కానంటోంది. ఇది ఎస్ఐఏ మాత్రమే ప్రచారంలో పెడుతున్నదని... అసలు తాను డీఎమ్ఎల్ (డిప్లమా మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్) విద్యార్థినిని అని చెబుతోంది. విద్యార్థి దశలో సమాజంలోని మహిళలపై కొనసాగుతున్న వివక్ష, అణచివేత లాంటి పితృస్వామ్య దోపిడీని అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నానన్న మావోయిస్టు రాధిక.. నా భావాలకు దగ్గరగా ఉన్న చైతన్య మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి కొంత కాలం పని చేసానంటోంది.
మహిళలపై అణచివేత, దోపిడీ వ్యవస్థీకృతమై ఉన్న ఈ వ్యవస్థలో సమాజ సమూల మార్పు జరగకుండా, విడిగా మహిళా విముక్తి చెందదని నేను అర్థం చేసుకున్నానని.. దానితో సీఎమ్ఎస్ సభ్యత్వానికి రాజనామా ప్రకటించానని మావోయిస్టు రాధిక ప్రకటనలో తెలిపింది. సమాజంలో జరుగుతున్న వర్గపోరాటంలో భాగమై పోరాడి ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం, తద్వారా సోషలిస్టు సమాజాన్ని స్థాపించడం ద్వారానే మహిళా విముక్తి సాధ్యపడుతుందనీ, అందుకు మార్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంత అధ్యయనం ద్వారా నేను అర్థం చేసుకున్నానని మావోయిస్టు రాధిక తెలిపింది.
నేనొక స్పష్టమైన రాజకీయ పరిణతిని పెంచుకున్న తర్వాత సీఎన్ఎస్ నుండి బయటకు వచ్చి సీపీఐ (మావోయిస్టు) నాయకత్వంలో కొనసాగుతున్నానని.. నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని... అప్పటికీ నా వయస్సు 20 సంవత్సరాలని... అంటే నేను మేజరని మావోయిస్టు రాధిక ప్రకటించింది. ఎస్ఐఏ ఆరోపిస్తున్నట్లుగా నన్నొవరో ప్రలోభపెట్టి, మాయం చేసి మావోయిస్టు పార్టీలో చేర్చారనేది చేస్తున్న ప్రచారం కుట్ర మాత్రమేనని మావోయిస్టు రాధిక తెలిపింది. మిస్సింగ్ అనే పేరుతో సీఎమ్ఎస్ నాయకురాళ్ళపై దాడి చేయడానికి ఈ కథనాన్ని సృష్టించారని స్పష్టంగా అర్థం అవుతున్నదని.. ఈ పేరుతో చేస్తున్న దాడులనూ, అక్రమ అరెస్టులను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మావోయిస్టు రాధిక ప్రకటనలో తెలిపింది.