సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి. ఇలాంటి వారిలో అందరి కన్నా చెప్పుకోదగ్గ నాయకుడు గొట్టిపాటి రవికుమార్. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం లో పరాజయం ఎరుగని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పార్టీలతో, జండాలతో సంబంధం లేకుండా తనకంటూ ప్రజల్లో ఒక ప్రత్యేక అభిమా నాన్ని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో ఇప్పటివరకు విజయమే తప్ప ప‌రాజ‌యం అన్నది తెలియకుండా అప్రతిహత రాజకీయ విజయం దక్కించుకుంటున్నారు.


వాస్తవానికి ఒక్కసారి విజయం సాధిస్తేనే నాయకులు పొంగిపోతారు. ఆధిపత్యం ప్రదర్శిస్తారు. కానీ గొట్టిపాటి రవికుమార్ విషయంలో మాత్రం ఇన్ని విజయాలు వచ్చినా పొంగిపోవడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. నిజానికి ఇన్ని విజయాలు సాధించిన తర్వాత సాధారణంగా ఒక నాయకుడికి కొంత ఆధిప‌త్య‌మో... నిర్లిప్త‌తో పెరుగుతుంది. నేను తప్ప ఈ నియోజకవర్గంలో మరో నాయకుడు లేడు అని భావన కూడా వస్తుంది. అయితే గొట్టిపాటి మాత్రం దీనికి భిన్నంగా ప్రజలను దేవుళ్ళుగా భావిస్తారు. ఇది అతిశయోక్తి కాదు, ఆయనను భుజాలకు ఎక్కించుకోవడం అంతకన్నా కాదు. ప్రజలు చెబుతున్న మాట.


బుజ్జన్న బుజ్జన్న అంటూ ప్రజలు ఆయనను మనసులో పెట్టుకున్నారు. గుండెల్లో దాచుకున్నారు. ఇప్పుడు ఆయన కోరకుండానే చంద్రబాబు మంత్రి పదవిని ఇచ్చారు. అయితే, ఈ పదవిని కూడా చాలా గౌరవంగా చాలా మర్యాదగా ప్రజల పట్ల ఎంతో అంకితభావంతో ఆయన నిర్వహిస్తుండడం విశేషం అనే చెప్పాలి. గతంలో ఇదే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు అయ్యారు. కానీ ప్రజలకు చెరువు కాలేకపోయారు. ప్రజల సమస్యలను పట్టించుకోలేకపోయారు. కానీ దీనికి భిన్నంగా గొట్టిపాటి రవికుమార్ మాత్రం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరుగులు పెడుతున్నారు.


అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన ఉపేక్షించరు. చివరికి తన ప్రత్యర్థి, రాజకీయంగా తన శత్రువు నియోజకవర్గమే అయినా రవికుమార్ పనితీరు మారదు. ప్రస్తుతం ఆయ‌న‌ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఈ శాఖలో ఉండే ప్రధాన సమస్యలు లైన్మెన్లు చనిపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి మంత్రులకు సెగ పెడతాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ, మంత్రి గొట్టిపాటి మాత్రం చాలా చాకచక్యంగా తనదైన శైలిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లైన్మెన్లు చనిపోతే ఒకప్పుడు పరిహారం ఇచ్చేందుకు చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. అనేక నిబంధనలు అడ్డుగా ఉండేవి.


కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి లైన్మెన్ కుటుంబాలు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు గంటల వ్యవధిలోనే స్పందిస్తున్నారు. ఇక కరెంటు కోతల విషయంలో గొట్టిపాటి పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కోతలు ఉండకుండా ఈ వేసవిలో ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే ఉదయం పూట మాత్రమే విద్యుత్ కోతలు ఉండేలా రాత్రి వేళల్లో ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు.


అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రజల నుంచి వస్తున్న కొంత వ్యతిరేకతను సర్దుమణిగేలా ఆయన ప్రవర్తిస్తున్నా రు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందన్న అపవాదులు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే చార్జీల పెంపునకు వైసిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలోనూ గొట్టిపాటి ముందున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తన పనిని ఒకవైపు సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు ప్రతిపక్షం చేస్తున్న ఎదురుదాడిని కూడా ఎదుర్కొంటూ మంత్రిగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. అందుకే చంద్రబాబు మంత్రివర్గంలో గొట్టిపాటి రవికుమార్ ఒక కీ రోల్ ప్లేయ‌ర్‌గా మారార‌న‌డంలో సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: