చాక్లెట్లు... ఈ పేరు వినగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరి నోళ్లలో నీళ్లు ఊరతాయి. పుట్టినరోజు వేడుకల నుంచి పండగల వరకు, చిన్న సంతోషం కలిగినప్పుడు లేదా బాధగా ఉన్నప్పుడు... ఇలా ఏ సందర్భంలోనైనా చాక్లెట్లు తప్పనిసరి. కొన్నిసార్లు బహుమతిగా ఇచ్చేవి కూడా ఈ చాక్లెట్లే. అయితే, ఈ తీపి రుచి వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయి. చాక్లెట్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తినే చాక్లెట్లలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు పెరుగుతారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఊబకాయానికి ఇది ప్రధాన కారణం. చాక్లెట్లలో ఉండే చక్కెర దంతాలను పాడు చేస్తుంది. ఈ చక్కెర దంతాల మీద ఒక పొరలాగా పేరుకుపోయి, బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. దీనివల్ల పంటి నొప్పి, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.

చాక్లెట్లు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే చక్కెర శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కొన్ని రకాల చాక్లెట్లలో కెఫిన్ మరియు థియోబ్రోమిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట చాక్లెట్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

ఎక్కువగా చాక్లెట్లు తింటే అజీర్తి, మలబద్ధకం లేదా గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు చాక్లెట్లలో ఉండే కొవ్వు పదార్థాలు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి.  చాక్లెట్లలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరానికి కావలసిన ఇతర పోషకాలు, విటమిన్లు, మరియు మినరల్స్ అందవు. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: