బాలీవుడ్‌లో థర్డ్‌ వేవ్‌ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు భారీ బ్లక్‌బస్టర్‌ లేదు. స్టార్ హీరోలంతా బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. అక్షయ్‌ కుమార్ అయితే ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్‌ దగ్గర అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది అక్కీ చేసిన రెండు సినిమాలూ బోల్తాపడ్డాయి. తమిళ్ హిట్ 'జిగర్తాండ' రీమేక్‌గా చేసిన 'బచ్చన్‌ పాండే', హిస్టారికల్‌ డ్రామా 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాలు రెండూ మినిమం ఓపెనింగ్స్‌ కూడా అందుకోలేకపోయాయి.

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఎవ్వరు హీరోలు అవుతారో, ఎవరు జీరోలు అవుతారో ఎవరూ చెప్పలేరు. వంద కోట్లు సాధించిన హీరోలు కూడా ఒక్కోసారి క్లీన్ బౌల్డ్ అవుతుంటారు. ఎవరూ ఊహించని హీరోలు భారీ విజయాలు అందుకుంటారు. కార్తీక్‌ ఆర్యన్ కూడా ఇలాగే ఈ ఏడాది బాలీవుడ్‌ ఫస్ట్‌హాఫ్‌కి బిగ్గెస్ట్‌ స్టార్‌గా అవతరించాడు.

కార్తీక్‌ ఆర్యన్‌ని 'దోస్తానా-2' నుంచి తీసేశాక బాలీవుడ్‌లో పెద్ద రచ్చ జరిగింది. కరణ్‌ జోహార్‌ ఫైర్ చేశాడంటే ఇంక కార్తీక్‌ కెరీర్‌ ముగిసిపోయినట్లే. మిగతా నిర్మాతలు కూడా కార్తీక్‌ని పక్కనపెట్టేస్తారు. కరణ్‌ జోహార్‌ బ్యాచ్ అయితే అస్సలు తీసుకోదని, అవకాశాల కోసం కష్టపడాల్సి వస్తుందనే మాటలు వినిపించాయి. ఇక ఇదే టైమ్‌లో షారుఖ్‌ ఖాన్‌ నిర్మాణంలో చేస్తోన్న 'ఫ్రెడీ' నుంచి బయటకు వచ్చేశాడు కార్తీక్.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌ నుంచి హీరోగా ఎదిగాడు. 'ఎమ్‌.ఎస్.ధోని-ది అన్‌టోల్డ్ స్టోరి' సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఈ హిట్‌తో ఎంత ఎత్తుకు వెళ్లాడో ఆ తర్వాత అంత డౌన్ అయ్యాడు. సెట్స్‌కి వెళ్తుంది అనుకున్న సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ అప్‌ అండ్‌ డౌన్స్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు.

కార్తీక్‌ ఆర్యన్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే స్టార్ అయ్యాడు. 'సోనూ కే టిటూ కీ స్వీటీ' హిట్‌తో ఫీమేల్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ఆ తర్వాత సారా అలీ ఖాన్‌తో లవ్‌, బ్రేకప్‌లతో మరింత పాపులర్‌ అయ్యాడు. అయితే కార్తీక్‌ ఆర్యన్‌కి అవకాశాలు తగ్గడంతో కెరీర్‌ కొలాప్స్‌ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ రీసెంట్‌గా రిలీజైన 'భూల్‌ భులాయా2' రెండు వందల కోట్లకి పైగా వసూల్ చేసింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలీవుడ్‌కి ఎనర్జీ ఇచ్చింది. దీంతో కార్తీక్‌ ఇమేజ్‌ మరింత పెరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: