దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా సినీ ప్రముఖులు కూడా వరుణుడి దెబ్బకు ఇక్కట్లుపడుతున్నారు. విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోతున్నారు. మరికొందరు టికెట్లు రద్దు చేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తన కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి లండన్ బయలుదేరేందుకు ఎయిర్పోర్ట్కు వెళ్లారు.
తీరా విమాన సేవలు దాదాపు 48 గంటల పాటు నిలిపివేయడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ.. ‘ఇంటికి క్షేమంగా చేరుకున్నాం’ అని పేర్కొన్నారు.అదే విధంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉదయం ముంబయి నుంచి హైదరాబాద్కు చేరుకోవాల్సి ఉంది. నిన్న రాత్రి నుంచి విమాన సేవలు అందుబాటులోకి రాకపోవడంతో తాను ఎయిర్పోర్ట్లోనే చిక్కుకున్నట్లు వెల్లడించారు.
మరోపక్క నటి కృతి సనన్ కూడా అహ్మదాబాద్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఆమెను చూడగానే ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆమె ప్రయాణించాల్సిన విమానాన్ని వేరే ప్రాంతానికి మళ్లించారు. నటుడు వరుణ్ ధావన్ కారులో ప్రయాణిస్తుండగా మోకాలి లోతు నీరు రోడ్లపై చేరడంతో ఆయన వాహనంలోనే చిక్కుకుపోయారు. ఆ నీటిలోనే కారును నడుపుకొంటూ వెళ్లినట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు.
నటుడు రణ్దీప్ హుడా ఈరోజు ఉదయం దిల్లీ నుంచి ముంబయి బయలుదేరారు. కానీ ముంబయి విమానాశ్రయ ప్రధాన రన్వే మూసివేయడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని నాగ్పూర్కు మళ్లించారు. చేసేది లేక విమానంలోనే చాలా సేపటి నుంచి కూర్చున్నానని, ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.