బోయపాటి సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ ఎవరి డైరెక్షన్‌లో నటిస్తాడు? ఈ ప్రాజెక్ట్‌ ఎనౌన్స్‌ చేసి 10 నెలలు అవుతున్నా తర్వాతి ప్రాజెక్ట్‌పై  క్లారిటీ లేదు. ఆ మధ్య బిగోపాల్‌ దర్శకత్వంలో నటిస్తాడని టాక్ నడిచినా ఎనౌన్స్‌ చేయలేదు. ఇంతకీ  బాలయ్యను డైరెక్ట్‌ చేసే డైరెక్టర్ ఎవరనే  దానిపై ఆయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

వారం రోజుల షూట్‌ తర్వాత బాలకృష్ణ, బోయపాటి సినిమాను కరోనా అడ్డుకుంది. షూటింగ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు‌. ఈ నెల 29న షూటింగ్‌ మొదలవడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌ రిలీజ్‌కు రెడీ చేయాలనే ప్లాన్‌లో ఉంది  చిత్ర యూనిట్‌.

బోయపాటి సినిమా కంటే ముందే బాలయ్య వినాయక్‌ దర్శకత్వలో నటించాల్సి ఉన్నా.. కథ సెట్‌ కాక.. ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి రాలేదు. లారీ డ్రైవర్‌.. రౌడీ ఇన్‌స్పెక్టర్‌.. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు వంటి సూపర్‌హిట్స్ తీసిన బి గోపాల్‌ బాలయ్యను మరోసారి డైరెక్ట్‌ చేస్తాడని ప్రచారం జరిగింది. కథ హీరోకు నచ్చలేదట. దీంతో ఈ కాంబినేషన్ కూడా కన్ఫార్మ్‌ కాలేదు. ఇక మిగిలింది పూరీ జగన్నాథ్‌ ఒక్కడే.

పైసా వసూల్‌ సమయంలో పూరీ జగన్నాథ్ మేకింగ్‌కు బాలకృష్ణ ఫిదా అయిపోయాడు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. మరో సినిమా వర్క్‌ చేస్తామని ఈ ఇద్దరూ ఎనౌన్స్‌ చేశారు కూడా. పైసా వసూల్‌ ఫ్లాప్‌ అయినా.. ఈ ఇద్దరి మధ్య దూరం పెరగలేదు. ఆ మధ్య పూరీ కొడుకు ఆకాశ్‌ మూవీ ప్రారంభానికి బాలయ్యే ముహూర్తం పెట్టించాడు. లాక్‌డౌన్‌ టైంలో పూరీ బాలయ్య కోసం కథ రెడీ చేశాడని.. ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయనేది టాక్‌. పూరీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్‌ అనే పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నాడు. దీని తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుందన్న వార్తలో నిజమెంతోగానీ.. ఒకసారి పాన్‌ ఇండియా మూవీకి అలవాటు పడిన పూరీ.. పెంచుకున్న మార్కెట్‌ వదిలేసి బాలకృష్ణను డైరెక్ట్‌ చేస్తాడా? అనే డౌట్‌ కూడా వుంది. లేదంటే.. బాలయ్యను పాన్‌ ఇండియా లెవల్‌కు తీసుకెళ్తాడా? ఏది ఏమయినా.. పైసా వసూల్‌ ఫ్లాప్ అయినా.. ఈ కాంబినేషన్‌కు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి: