నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో 90లలోనే తెలుగు తెరపై కొత్త ప్రయోగం చేసిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ రానున్నట్టు సమాచారం. చాలాకాలంగా లాంచ్ దశలోనే ఆగిపోయిన “ఆదిత్య 999 మ్యాక్స్” ప్రాజెక్ట్ చివరికి సెప్టెంబర్‌లో పట్టాలెక్కబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌కి బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. అలాగే తన తనయుడు మోక్షజ్ఞను ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. కానీ, నటనతో పాటు డైరెక్షన్‌ను సమాంతరంగా చేయడం కష్టమవుతుందని భావించిన బాలయ్య… ఈ బాధ్యతను స్టార్ డైరెక్టర్ క్రిష్ కు అప్పగించారు.

భారీ సెట్టింగులు, ఫాంటసీ టచ్‌, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా గ్రాండ్‌గా, ఉత్కంఠభరితంగా రూపొందించేలా క్రిష్ ప్లానింగ్ చేస్తున్నాడట. సినిమాలో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. వాటిలో ఒకటి చారిత్రాత్మకమైన శ్రీకృష్ణదేవరాయ పాత్ర అని టాక్. మిగతా రెండు లుక్స్‌పై మేకర్స్ టాప్ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అసలైన సస్పెన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీపైనే ఉంది. తొలుత ఆయనను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో సోలో మూవీతో పరిచయం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా ప్రాజెక్ట్‌ మొదలై, లుక్ టెస్ట్ కూడా జరిగింది.

కానీ తర్వాత బాలయ్య అభిప్రాయం మార్చారు. తన తండ్రి లెజెండరీ ఎన్టీఆర్, తనను కూడా మొదట సహాయ పాత్రలోనే పరిచయం చేసినట్టు… ఇప్పుడు తనయుడిని కూడా అదే తరహాలో “ఆదిత్య 999 మ్యాక్స్” లో ముందుగా స్క్రీన్‌పై చూపించాలని నిర్ణయించారట. ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లు దాటింది. ఇంతకాలం ఆయన ఎంట్రీపై వస్తున్న రూమర్స్ అభిమానులను ఆతృతకు గురి చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌లో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మొదలైతే, బాలయ్యతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఖాయం అవుతుందనే నమ్మకంలో ఉన్నారు ఫ్యాన్స్. బాలయ్య–క్రిష్ కాంబోలో తెరకెక్కబోయే ఈ ఫాంటసీ టైమ్ ట్రావెల్ సాహస యాత్ర తెలుగు సినిమాకి కొత్త మైలురాయిగా నిలుస్తుందా? అనేది చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: