ప్రపంచం మొత్తం యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది. ఇరాన్ - ఇజ్రాయెల్ గొడవలతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి అదుపుతప్పింది. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేల సంఖ్యలో ప్రయాణికులు దుబాయ్, అబుదాబి విమానాశ్రయాల్లో దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. ధనవంతులు లక్షలు పోసి చార్టర్ విమానాల్లో పారిపోతుంటే, సామాన్య ప్రయాణికులు మాత్రం తిండి, నిద్ర లేక అల్లాడిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే 'నిజమైన హీరో' ఎంట్రీ ఇచ్చారు. ఆయనే మన సోనూసూద్‌!కరోనా సమయంలో వేల మంది వలస కార్మికులను కంటికి రెప్పలా కాపాడిన సోనూసూద్‌, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన ఉదారతను చాటుకుంటున్నారు. దుబాయ్‌లో చిక్కుకున్న వారి కోసం ఆయన ప్రకటించిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.


దుబాయ్‌లో విమానాలు లేక, హోటల్ రూమ్స్ దొరకక ఇబ్బంది పడుతున్న వారి కోసం సోనూసూద్ ఒక కీలక ప్రకటన చేశారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ తన తరఫున ఉచితంగా బస (Free Stay) కల్పించనున్నట్లు సోనూసూద్ వెల్లడించారు."నేను సాయం చేసేది కేవలం భారతీయులకే కాదు.. ఏ దేశస్థుడైనా సరే, మనిషి అయి ఉండి కష్టాల్లో ఉంటే చాలు.. వారికి మా టీమ్ అండగా ఉంటుంది" అని సోనూసూద్‌ గొప్ప మనసు చాటుకున్నారు. ఎటువంటి షరతులు లేకుండా, కేవలం మానవత్వంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.



దుబాయ్‌లో ఇబ్బంది పడుతున్న వారు సోనూసూద్‌ను ఎలా సంప్రదించాలో కూడా ఆయన వివరించారు:కష్టాల్లో ఉన్న ప్రయాణికులు సోనూసూద్‌ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాకు నేరుగా మెసేజ్ చేయవచ్చు.మెసేజ్ అందిన వెంటనే సోనూసూద్‌ వాలంటీర్ టీమ్ వారిని సంప్రదించి, సురక్షితమైన చోట వసతి ఏర్పాటు చేస్తుంది.ఇప్పటికే కొన్ని వందల మందికి వసతి కల్పించేలా సోనూసూద్‌ దుబాయ్‌లోని కొన్ని హోటళ్లతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.



గతంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులకు బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి సొంతూళ్లకు చేర్చిన ఘనత సోనూసూద్‌ది. అప్పట్లో ఆయనను అందరూ 'వలస కార్మికుల దేవుడు' అని పిలిచారు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధ సమయంలో కూడా విదేశీ గడ్డపై ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు రావడం విశేషం.సోనూసూద్‌ చేసిన ఈ ప్రకటన నెటిజన్ల మనసు గెలుచుకుంది. "సినిమాల్లో విలన్ కావొచ్చు కానీ, నిజ జీవితంలో మాత్రం నీకంటే పెద్ద హీరో లేడు సోనూ భాయ్" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: