మరోమారు ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపు ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. సుప్రసిద్ధ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్ప్(ఐబీఎం) ఈ వారం రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. సరియైన పనితీరు కనబర్చడం లేదనే కారణంతో వీరిని తీసేస్తున్నట్టు రిపోర్టులు వచ్చాయి. కాంపిటిటివ్ స్థాయిలో పనిచేయని తక్కువ శాతం మంది ఉద్యోగులు కంపెనీని వీడుతున్నట్టు ఐబీఎం ధృవీకరించింది. కాగా, ప్రస్తుత తొలగింపు అమెరికా ఉద్యోగుల్లో ఉండనుందని రిపోర్టులు పేర్కొంటుడాగా...ఇందులో భారతీయులు కూడా ఉన్నారని సమాచారం.
మారుతున్న తన కస్టమర్ల డిమాండ్ను అందుకోవాలని ఐబీఎం చూస్తోంది. ఐటీ మార్కెట్లో కొత్త ఛాలెంజ్లకు తన ఉద్యోగులను సన్నద్ధం చేస్తోంది. ఒకవైపు సరిగ్గా పనిచేయని ఉద్యోగులను తొలగిస్తూనే.. మరోవైపు కొత్త వారిని నియమించుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న ఆఫీసుల్లో 25 వేల ఖాళీలను భర్తీ చేస్తోంది. టెక్ ఇండస్ట్రీలో హై వాల్యు సెగ్మెంట్లపై ఫోకస్ చేసేందుకు కంపెనీకి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. తొలగిస్తున్న ఉద్యోగులు మొత్తం వర్క్ఫోర్స్లో 1 శాతం కంటే తక్కువే అని పేర్కొన్నాయి.
ఉద్యోగులను తొలగించడానికి మరో కారణం కంపెనీ రెవెన్యూలు పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఐబీఎం 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒకశాతం రెవెన్యూ వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. 2018 ఆగస్ట్లో కూడా 200 మంది సీనియర్ ఉద్యోగులను రాజీనామా కోరింది. ఇటీవలే ఇండియాలోని తన సర్వీసెస్ డివిజన్ నుంచి ఐబీఎం 300 మంది ఉద్యోగులను తొలగించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలోకి మారుతోన్న క్రమంలో తొలిసారి 2016 నుంచి ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. తొలిసారి అమెరికాలో ఉద్యోగులను తొలగించింది.గతేడాది చివరి నాటికి ఐబీఎంలో 3,50,600 మంది ఉద్యోగులున్నారు. ఇదిలాఉండగా, అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ కూడా గత నెలలో 200 మంది సీనియర్ ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా వారు పనిచేయలేకపోతున్నారని కంపెనీ చెప్పింది. అదేవిధంగా కాగ్నిజెంట్ కొత్త డిజిటల్ టెక్నాలజీలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో వీరిని తొలగించినట్టు సమాచారం.