కువైట్ లో కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన భారతీయ ప్రవాసులకు ఆర్థిక సహాయం అందింది. కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి 65 మంది ఎన్నారైలకు లక్ష రూపాయల చొప్పున నగదు పరిహారంగా అందించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయం నుంచి ఇప్పటి వరకు కువైట్ దేశంలో 540 మంది భారతీయులు చనిపోయారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన కుటుంబ సభ్యులు కరోనాతో చనిపోవడంతో చాలా మంది ప్రవాసులు కువైట్ లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో వందకుపైగా భారతీయ ప్రవాసులు 120 కువైటీ దినార్ల కంటే తక్కువ జీతాలతోనే జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి నిరుపేద ప్రవాసులకు ఆర్థికంగా చేయూత అందిస్తామని భారత రాయబారి సిబి జార్జి జూలై 28 వ తేదీన ప్రకటించారు.

ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భారత ఎంబసీ తక్కువ ఆదాయం గల ఎన్నారైలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఆదివారం నాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రవాసులకు లక్ష రూపాయల చొప్పున డబ్బు అందజేసారు. లక్ష రూపాయలు ఎక్కువ కాకపోవచ్చు కానీ బాధిత కుటుంబాలకు ఎంతోకొంత చేయూత అందించినట్లు అవుతుందని సిబి జార్జి పేర్కొన్నారు.

అయితే కేవలం నిరుపేద కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా సిబి జార్జి చర్యలు చేపట్టారు. భారత ఎంబసీ కి చెందిన ముగ్గురు అధికారులు ఒక బృందంగా ఏర్పడి అల్పాదాయ వర్గాల ను గుర్తించారు. అనంతరం వారికి ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ఐసీఎస్‌జీ) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో భారతీయ ప్రవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభంలో తమకు ఆర్థిక సహాయం అందించిన భారతీయ రాయబారి కి కృతజ్ఞతలు తెలిపారు. 

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సిబి జార్జి.. కువైట్, భారత్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: