ఈ మద్య సోషల్ మీడియాలో ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతుంది. ఆ మద్య వైజాగ్ లో రెండు వింత పక్షులు వచ్చాయని..అవి ఏలియన్స్ అని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు..తీరా చూస్తే అవి గుడ్లగూబ జాతికి చెందిన పక్షులని తెలియడంతో అంతా నీరుగారిపోయారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది కూడా విశాఖ నుంచే కావడం విశేషం. విశాఖ తీరంలో జాలర్లకు అచ్చం మనిషిని పోలిన చేప దొరికిందని అంటున్నారు.
ముందు ఉదర భాగం, చేతులు అచ్చం మనిషి పోలి ఉన్న ఆ చేప వీడియో, ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండు చేతులు వెనక్కి కట్టేసి ఉంచిన ఆ చేప బతికే ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో జనాలు సముద్ర గర్భంలో నిజంగా మనిషులను పోలిన వారు జీవించే ఉన్నారా..? సాధారణంగా ఇలాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం..ఆయితో ఆ వీడియోలో నిజంగా మనిషిని పోలినట్లు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
దీనికి గురించి కొంత మంది వాకబు చేయగా..అది, అస్సలు జీవే కాదని, ఓ కళాకారుడు రూపొందించిన కళాఖండమని తెలిసింది. మయన్మార్కు చెందిన ఓ కళాకారుడు చెక్క, ఫైబర్ వినియోగించి ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు మయన్మార్ పత్రికలు వెల్లడించారు. ఈ కళాఖండం సహజంగా కనిపించేందుకు దాని గొంతు భాగంలో మోటారును ఏర్పాటు చేశారు.
ఈ కళాఖండానికి చెందిన ఫొటోలు, వీడియోలు.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. కొందరు ఇది విశాఖపట్నంలోనే దొరికిందంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ గా షేరవుతోంది.