మిత్రమా! శివాజీ! మీరు చంద్రబాబు గుఱించి బాధ పడ వద్దు ప్లీజ్!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పు. అందులో అనుమానం లేదు
ఆయనే ఒక వెయ్యి సార్లైనా చెప్పిఉంటారు. అలాంటి చంద్రబాబు అనే నిప్పును ఆఫ్ట్రాల్
నరెంద్ర మోదీ ఏంచేయగలరు? ఏదైనా చేయాలనిపించి దగ్గరికెళితే బస్మమైపోడూ!
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలోని రాజ్యాంగబద్ద సంస్థ నుంచి నోటీసులు రాబోతున్నాయని, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి తనకు సమాచారం వచ్చింది” అని తెలుగు సినీ హీరో శివాజీ అన్నారు.
“నిన్న అర్థరాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది”
అని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు.
“ఆపరేషన్ గరుడ - ఆపరేషన్ ద్రవిడ” అంటూ ఒక సంవత్సర కాలం గా నటుడు శొంఠినేని శివాజి ఊదర గొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ గరుడ రూపం మార్చుకుని మరో రూపంలో రాష్ట్రంపై దాడికి దిగబోతున్నారని, ముఖ్యమంత్రిని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి ఒక జాతీయ పార్టీ పంజా విప్పిందని ఆయన అన్నారు.
"ఒక ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడం కాదా?" అని ఆయన అడిగారు. "వివరాలు చెప్పలేను, నాకు ప్రాణహాని ఉంది" అని ఆయన అన్నారు. ఇక్కడ ప్రాణహానికి వెరచే వారు ఇంతదూరం రారు. కాబట్టి ఇక్కడే ఆయన ఆలోచనలన్నీ ముందుగా ఉద్దేశింపబడినవని అంకోవలసి వస్తుంది. ఎవరు రాజకీయాలలో వ్యూహాలు పన్నకుండా ఉండరు. ఏదో జనాన్ని భయపెట్టాలని టైటిల్స్ పెట్టే శివాజి మానసిక స్థితి అర్ధంచేసుకోవాలి.
ప్రజలను పక్కన పెట్టేసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అది సరే. ప్రజలని ప్రక్కనపెట్టని రాజకీయ నాయకుడెవరు. ఇదే చంద్రబాబు తనకు సంబందంలేని కర్ణాటక ఎన్నికల్లో నాటకాలు వేయలేదా? అలాంటి వ్యక్తి నాయకత్వానికి నరెంద్ర మోడీ లాంటి ఘటికుడు గండికొట్టకుండా ఉర్కుంటాడా?
"హక్కుల కోసం అడిగితే వరవరరావు ను ఏం చేశారో? చూశారు కదా!" అని అయన అన్నారు. ఇక్కడ వరవరరావు ఒక సిద్ధాంతవాది. ఏ సిద్ధాంతమూ లేకుండా రాజకీయ అధిపత్యానికి అడ్డువచ్చిన పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన నాయకునికి పోలికెక్కడ?
"రెండు సార్లు తనకు ముప్పు వాటిల్లిందని, మీడియా వల్ల తాను బతికిపోయాను" అని శివాజి శొంఠినేని అన్నారు. తనకు తెలిసిన విషయాన్ని ప్రజలకు చెప్పానని ఆయన అన్నారు.
శొంఠినేని శివాజికి మీడియా సపోర్ట్ లేదని ఎవరు అనగలరు. ఊభయ రాష్ట్రాల్లోని తెలుగు మీడియా అగ్రపథాన నడిపించే వారంతా సామాజికంగా శివాజి వర్గం వాళ్ళే కాబట్టి, జనానికి మీకు మీడియా మద్దతు ఉండదని ఎవరన్నారు? మీరు ఆపరేషన్ గరుడ అని 'పరెషాన్' అవ్వగానే పదుల సంఖ్యలో టివి చానళ్ళు, పది లోపు ప్రముఖ పత్రికలు వెన్నంటి నిలిచాయి. మీరు ఉలిక్కి పడితే మీడియా, జీ హుజూర్ ! అంటూ రంగ ప్రవేశం చేయకుండా ఊర్కుంటుందని ఎవరంటారు? మోడీ కాదు గదా! ఎవరైనా మీ సామాజిక వర్గాన్ని టచ్ చేయగలరనేది ఒక ఊహాజనితమే కదా!
"రాజకీయ వ్యవస్థలకు చట్టాలు చుట్టాలయ్యాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి మీ బాబు గారు ఆఫ్ట్రాల్ వినోదపు పన్నునందమూరి బాలకృష్ణ సినిమాకే చేశారు కదా! వేరెవరికి ఆ అవకాశం లేశమంతైనా ఇచ్చారా? ఏందుకు సార్! ఈ నీతులు?
తన స్థానంలో జగన్మొహన్ రెడ్ది ఉన్నా తన ఆవేదనను ఇలాగే వ్యక్తం చేసేవారని ఆయన అన్నారు. రాష్ట్రంలో నచ్చిన వారుంటేనే నిధులు ఇస్తారా? అని ఆయన అడిగారు. భగవంతుడే అన్యాయాన్ని అడ్డుకుంటాడని ఆయన అన్నారు. ఎక్కడో ఎవరో ఉంటారని, వారి వల్ల న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ఇది మాత్రం చాలా బాగుంది సార్! మీ పోజిటివ్ థింకింగ్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకటే ఒక జాతీయ పార్టీ మాత్రం మీలాంటి పిపీలికాన్ని మాత్రం ఏమీ చేయదని మాత్రం నమ్మొచ్చు. కారణం ఒక చీమను చంపితే వాళ్ళకి ఏంలాభం? పరువుపోవటం తప్ప.
ఏపీని
నాశనం చేయడమే కాకుండా, ఇక్కడి ప్రాంతీయ పార్టీలు మనుగడలో కూడా లేకుండా
చేయాలనుకోవడం దారుణమని శివాజీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు తప్పు చేసి ఉంటే రెండు నెలలు, నాలుగు నెలలు లేదా సంవత్సర కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని,
ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దాడికి ఏమిటంటూ శివాజీ మండిపడ్డారు.
ఇదే పాయింట్ తీసుకుందాం సార్! నాలుగేళ్ళు అంటకాగి ఇప్పుడు బాజపా-ఎన్డిఏ నుండి బయటపడి నరెంద్ర మోడీని నిదించటం న్యాయమా? గతంలో మీరు రెండు సార్లు ఎన్డిఏ లో చేరి పబ్బం గడిపేసుకోని, బయటపడిన చరిత్ర బాబుది. ఇప్పుడు మోడీ హయాంలో ఎన్డిఏలో కలవటం మూడో సారి. సిగ్గున్న ఎవడూ ఇలా చేయడు. గతం — పాపభీతి గట్ర ఉన్న వాజపేయి - అద్వానీల కాలమది. అందుకే అతి తేలిగ్గా వారిని మోసంచేసిన నైతికత మీది. ఇప్పుడు మోడీ మీకు సరైన మొగుడు. అందుకే ఇప్పుడు మీ వేషాలు సాగలేదు.
కేంద్ర౦ తీరుపై తాను ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నానని, ఆంధ్ర రాష్ట్రంపై తనకున్న అభిమానమే దానికి కారణమని శివాజీ అన్నారు. ఏమి సాధించారు? అనేది ముఖ్యం మహా ఐతే మీ నోటి దూల తీర్చుకున్నారు. పోరాటం అంటే తెలంగాణా నాయకులను చూసి నేర్చుకోవాలి. చంద్రబాబును చూసి కాదు!
అసలు శివాజీకి ఏ బెంగా అవసరం లేదు. నిప్పునిప్పు అని ప్రతిసభలో స్వరపేటిక పగిలేలాగా గొంతు చించుకుని చెప్పుకునే ముఖ్యమంత్రికి నోటీసులు వస్తే మాత్రం ఏమిటి? ఎన్క్వయిరీ వేస్తే మాత్రం ఏమౌతుంది? ఆయన నిప్పు అయితే నిప్పులో పునీతులై బయటకొస్తారు. కాకపోతే తుప్పౌతారు. మీకు వచ్చే నష్టం ఏమిటి? మహా ఐతే అప్పుడు బాబు గారి ఇమేజ్, మోడీ ఇమేజ్ ని మించి ఉంటుంది.
శివాజీ గారు! పర్లేదు సార్! నోటీసులు రానివ్వనీయండి! చూద్ధాం! నాటకాల రాయుడు, మన నారా నాయుడు మహా ఐతే మరో "యూ-టర్న్ తీసుకుంటారు" అసలే ఆయనో "ప్రాప్తకాలఙ్జుడు" భయపడనవసరంలేదు.
కాంగ్రెస్ — తెలుగుదేశం పార్టీ ల పొత్తు విషయంపై ప్రజల దృష్టి మరల్సేందుకే నటుడు శివాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో మాట్లాడుతున్నారని బిజెపి విమర్శించింది. ఆపరేషన్ గరుడ అంటూ ఏవేవో మతి భ్రమించి శివాజీ మాట్లాడుతున్నారని ఆ పార్టీ అదికార ప్రతినిది కోట సాయికృష్ణ చెప్పారు.
బిజెపి నాయకత్వంపై శివాజీ చేస్తున్నది తప్పుడు ప్రచారం అని ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు. అందులో ఏ ఒక్కటైనా నిజమైందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు.
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైంది..కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియాను దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.