మంత్రుల్లో 15వ తేదీ టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ మంత్రుల్లోనే కాదులేండి ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే ఈనెల 15వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ఎల్పీ సమావేశం జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. శానసనభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్ సమావేశం నిర్వహించి చాలాకాలమైంది. తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందని క్యాబినెట్ భేటీలో స్వయంగా జగన్ చెప్పినదగ్గర నుండి టెన్షన్ పెరిగిపోతోంది.





అలాంటిది ఈనెల 15వ తేదీ అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన మరుసటి రోజే జగన్ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరితో కలిపి సమావేశం నిర్వహించబోతున్నారు. మంత్రివర్గం నుండి తప్పించబోతున్న వారందరినీ పార్టీ బలోపేతానికి వాడుకోబోతున్నట్లు కూడా చెప్పారు. అంటే మంత్రివర్గం నుండి ఎవరిని తప్పించాలి ? ఎవరిని తీసుకోవాలనే విషయంలో జగన్ లెక్క ఇప్పటికే ఫైనల్ అయిపోయిందని అర్ధమవుతోంది.





ఇష్టమున్నా లేకపోయినా మంత్రివర్గం నుండి తప్పుకున్న వారు తమకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందే. మంత్రివర్గంలో నుండి తప్పించేందుకు లేదని బెదిరించటాలు, బ్లాక్ మెయిల్ చేయటాలు, అలగటాలు జగన్ దగ్గర పనిచేయవు. 2019 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగేస్తానని  బెదిరిస్తేనే జగన్ లెక్కచేయలేదు. మంత్రివర్గ ఏర్పాటు తర్వాత రోజాలాంటి వాళ్ళు అలిగి, ఏడ్చినా పట్టించుకోలేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి, కొడాలినాని, బుగ్గన రాజేంద్రనాదరెడ్డి, పేర్నినాని/బాలినేని శ్రీనివాసరెడ్డి  కంటిన్యు అయ్యే అవకాశాలున్నాయట.





ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మందున్నారు. నలుగురిని కంటిన్యుచేస్తే కొత్తగా 21 మందికి అవకాశముంటుంది. ఈ 21 మందిని కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాల నుండి  సామాజికవర్గాలవారీగా ఎంపిక చేసుకుంటారనటంలో సందేహంలేదు. అందుకనే మంత్రుల్లోను ఎంఎల్ఏ, ఎంఎల్సీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైగా మంత్రివర్గం నుండి తప్పించిన వారిని పార్టీ బలోపేతానికి వాడుకోనున్నట్లు కూడా చెప్పేశారు. రాబోయే ఎన్నికలకు ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని సన్నద్ధం చేసుకోవటానికి జగన్ ప్లాన్ చేసేశారు.   మొత్తానికి జగన్ లెక్క ఎంత క్లారిటితో ఉంటుందో అందరికీ తెలిసొస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: