భద్రాద్రి రామయ్య భక్తులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.  రేపటి నుంచి ఇక్కడ శ్రీ రామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ ఈవో షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని టికెట్ల ధరలు భారీగా పెంచేశారు. రూ. 20 ఉన్న లడ్డూ ధర రూ. 25కి పెరిగింది. పులిహోర రేటు రూ. 10 నుంచి రూ. 15కు పెరిగింది.


ఇక చక్కెర పొంగిలి రేటు రూ. 10 నుంచి రూ. 15 కి పెరిగింది. కేశ ఖండన టికెట్ రేటు రూ. 15 నుంచి రూ. 20కి పెరిగింది. శ్రీ రామ నవమి వేళ కల్యాణాన్ని తిలకించే ఉభయదాల టికెట్ రేటు రూ. 5,000 నుంచి రూ. 7,500 కు పెంచారు. రూ. 2,000 ఉన్న టికెట్ రేటును రూ. 2,500 కు పెంచేశారు. అలాగే రూ. 1,116 ఉన్న టికెట్ రేటు రూ. 2,000 కి పెంచారు.


రూ. 500 ఉన్న టికెట్ రేటు రూ. 1,000 కి పెంచారు. రూ. 200 టికెట్ రేటు రూ. 300 కు పెరిగింది. 11న తేదీన జరిగే మహా పట్టాభిషేకం రోజున ఉభయదాతల టికెట్ ధర రూ. 250 నుంచి నాలుగురెట్లు పెంచి రూ. 1,000 కి పెంచేశారు. ఇలా భారీగా రేట్లు పెంచడంపై భక్తులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాగా పేరున్న ఆలయాల్లో భద్రాచలం ఒకటి.


భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. భద్రాద్రి రామయ్య అంటే.. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. ఏపీలోనూ భక్తులు పవిత్రంగా భావిస్తారు.. ప్రత్యేకించి గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు. ఇటీవల అన్ని  గుళ్లను బాగు చేస్తున్న కేసీఆర్ సర్కారు భద్రాద్రిపై శీతకన్ను వేసిందన్న విమర్శ ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇక్కడ ధరలు పెంచడం విమర్శల పాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: