రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా సాధారణం.. కానీ కొన్ని ఆరోపణలు పదే పదే చేయడం కారణంగా ప్రజలు కూడా నిజమేమో అనుకునే పరిస్థితి తలెత్తుతుంటుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని టీడీపీ నేతలు అంటుండేవారు. అంతకుముందు జగన్ ఒక్క రోజు అధికారంలో లేకపోయినా ఇలా విమర్శించేవారు.
ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే రూట్ లో వెళ్తున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. హుందా రాజకీయం అనేది లేకపోతే ప్రజలు చీత్కరించుకుంటాడని లేకుండా దిగజారిపోయి మాట్లాడుతున్నాడన్న ఆమె... కేవలం ఒక పర్సంట్ తేడాతోనే సీఎం అయ్యావు.. వచ్చిన తరువాత భారీ అవినీతికి పాల్పడ్డావు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు సీఎంను విమర్శించే అర్హత లేదన్నారు.
లక్ష్మీపార్వతి ఇంకా ఏమన్నారంటే..
“ అన్ని హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు వైయస్ జగన్ చేస్తున్న ఒక్క కార్యక్రమాన్ని కూడా అభినందించలేకపోతున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబును చూస్తే ఊరంతా ధాన్యం ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకుందంట. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందన్నారు.కోడెల శివప్రసాదరావు శవాన్ని భుజాన వేసుకొని దారుణాలు జరిగాయని మాట్లాడుతున్నాడు. శవరాజకీయం చేస్తూ వైయస్ జగన్పై నిందలు వేస్తున్నాడు.
ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసేది ఒకటే శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తానని మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు కాలం గడిపి ఎన్నికల ముందు రెండు నెలలు రూ. వెయ్యి ఇచ్చి మోసం చేశారు. “