ట్రంప్ ఇండియా టూర్ ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ టూర్ లో ట్రంప్ కు సంబంధించిన అనేక విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఆయన దర్పం, రాజసం.. ఔరా అనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ ను ఇండియాకు మోసుకొచ్చిన.. ఇండియాలోనూ ట్రంప్ ను అనేక చోట్లకు తిప్పుతున్న ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్గా పిలిచే బోయింగ్ 747-200బీ సిరీస్ విమానం అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ విమానం ట్రంప్ ఇండియా టూర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ విమానం ప్రత్యేకతలు తెలుసుకుంటే మీరు ఔరా అనకతప్పదు. అమెరికా అంటేనే భూతల స్వర్గం. మరి ఆ దేశం అధ్యక్షుడి విమానం అంటే మామూలుగా ఉంటుందా.. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత చాటుకునే అమెరికా దేశాధ్యక్షుడి విమానాన్ని కూడా అత్యంత అధునాతనంగా, వైభవంగా తీర్చిదిద్దింది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ విమానంలోనే వెళ్తారు. వేరే విమానం ఎక్కరు. దీన్ని ఎయిర్ఫోర్స్ వన్ అని పిలుస్తారు. ఇది బోయింగ్ 747-200బీ సిరీస్ విమానం.
ఈ బోయింగ్ 747-200బీ సిరీస్ విమానం ప్రత్యేకత ఏంటంటే.. ఇది గాల్లోనే ఇంధనం నింపుకోగలుగుతుంది. అధునాతన సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంది. ఒకవేళ అమెరికాపై దాడులు జరిగితే.. ఆ సమయంలో ఈ విమానం మొబైల్ కమాండ్ సెంటర్గా కూడా పనిచేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది ఇందులో. ఇక ఈ విమానం లోపల 4 వేల చదరపు అడుగుల స్థలం ఉంటుంది. ఎక్స్టెన్సివ్ సూట్లో అధ్యక్షుడి కోసం ఓ పెద్ద ఆఫీస్, కాన్ఫరెన్స్ గది, టాయిలెట్ ఉంటాయి.
మెడికల్ సూట్లో ఓ డాక్టర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అధునాతన సర్జరీ హాల్ కూడా ఉంటుంది. ఈ విమానంలోనే రెండు అతి పెద్ద కిచెన్లు ఉంటాయి. ఇందులో 100 మందికి సరిపడా వంట ఒకేసారి చేయొచ్చట. ప్రెసిడెంట్, ఆయన భార్య కోసం ప్రత్యేకమైన గదులుంటాయి. అధ్యక్షుడితో కలిసి ప్రయాణించే సీనియర్ అడ్వైజర్లు, సీక్రెట్ సర్వీస్ అధికారులు, ప్రెస్, ఇతర అతిథుల కోసం వేర్వేరుగా గదులుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఫ్లయింగ్ వైట్ హౌస్ అని చెప్పొచ్చు.