దేశవ్యాప్తంగా పొట్టకూటికి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కష్టాలు చూస్తుంటే ఎంతటి పాషాణ హృదయంలోనైనా చెమ్మరాక మానదు.. పలుచోట్లవారి ఆందోళనలు, ఆవేదనలు చూస్తేంటే.. సాటి మనుషులుగా ఆ ఆవేదన మన మనసులన్నీ కూడా కమ్మేస్తోంది. అలాంటి వలస కూలీలకు కేసీఆర్ బ్రహ్మాండమైన శుభవార్త చెప్పారు. అవును.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు నడపబోతున్నారు.

 

 

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా వలస కూలీల కోసం రైళ్లు నడపుతారట. బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఈ శ్రామిక్ రైళ్లు నడుపుతారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుండడంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది.

 

 

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని ఈ సందర్భంగా కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్యతో మాట్లాడి, నేటి నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది కూడా

 

 

సొంత స్థలాలకు వెళ్ళేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తారు. పోలీస్ స్టేషన్లలోనే వివరాలు ఇస్తారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించి, కార్మికులను సమన్వయం చేయాల్సిందిగా పోలీసు అధికారులను కేసీఆర్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: