ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. నెలలు గడుస్తున్నా వ్యాక్సిన్ రాకపోవడంతో.. ఈ మహమ్మారి రోజురోజుకు మరింత వేగంగా వ్యాప్తిచెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ ప్రాణాంతక వైరస్ గుప్పెట్లో నుంచి ఎప్పుడు బయటపడతామో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి.
దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆగస్టు 5వ తేది వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా శరవేగంగా వ్యాప్తిచెందుతుంది. ముఖ్యంగా తిరుపతిలో అత్యధిక కేసులు నమోదవుతున్నారు.
దీంతో కరోనాను కట్టడి చేసేందుకు మంగళవారం నుంచి ఆగస్టు 5వ తేది వరకు.. 14 రోజులపాటు నిబంధనలు అమల్లోకి వస్తాయని భరత్ గుప్తా తెలిపారు. అలాగే అన్ని వ్యాపారాలకు 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే అనుమతి ఉంటుం దన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బ్యాంకుల సహా అన్నింటినీ మూత వేయాల్సిందేనన్నారు. అయితే వైద్య అవసరాల కోసం ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల కేంద్రాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఉదయం 11 గంటలపైన ఉద్యోగులు మినహా ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని కోరారు. ఈ నెలాఖరున పరిస్థితిపై సమీక్షించి మరోసారి నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించి తమకు సహకరించాలని ఆయన కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి