నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను ఎస్ఈసీగా నియమించాలని ఆయన గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసుకుంటే... గవర్నర్ తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే గవర్నర్ ఉత్తర్వుల తర్వాత కూడా వైసీపీ నిమ్మగడ్డ తీరుపై విమర్శలు ఏమాత్రం తగ్గించలేదు.. నిమ్మగడ్డ రమేష్ రాజ్యంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో మంతనాలు జరుపుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరు సరిగా లేదని అంటున్నారు.

ఎస్ఈసీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

శ్రీకాంత్ రెడ్డి మరికొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు.కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏదోరకంగా ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శవాలపై కూడా రాజకీయం చేసే దుర్భుద్ధి చంద్రబాబుదని శ్రీకాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇంతకీ ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమిస్తుందా.. లేదా అన్న ఉత్కంఠకు మాత్రం ఇంకా తెరపడలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి