దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. అయితే గతంలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ లో ఐదు వందల కేసులు నమోదు కాగా మూడో తేదీన 391 కేసులు నమోదయ్యాయి. నిన్న గ్రేటర్ పరిధిలో 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఈరోజు ఉదయం వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
జులై నెలలో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో కలిపి 1095 కేసులు నమోదు కాగా సోమ, మంగళవారాల్లో 664 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గ్రేటర్ లో నమోదవుతున్న కేసుల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహిస్తున్న రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో సగటున 17 శాతం వరకు పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్నాయి.
 
శనివారం బక్రీద్‌, ఆదివారం సెలవు, సోమవారం రాఖీ పౌర్ణమి కావడం... వరుస సెలవుల నేపథ్యంలో పరీక్షలకు వచ్చే వారి సంఖ్య తగ్గడం కూడా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడానికి ఒక కారణమని తెలుస్తోంది. మరోవైపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా పరీక్షల కోసం ముందుకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు.
 
గత నెలలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో నగరవాసుల్లో చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. నగరంలో కేసుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 2013 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 19,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 576కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: