చంద్రబాబు ఒక టూరిస్ట్ అని.. టూరిస్ట్లా ఏపీకి వచ్చి సాయంత్రానికి ఫ్లైట్ ఎక్కి పోయే ప్రతి పక్షనేతని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అంటున్నారు. అలాంటి టూరిస్టు పొలిటిషయన్ కు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కూడా లేదంటున్నారు. వరదలు వచ్చి కరకట్ట మీద ఇల్లు మునుగుతుంటే.. ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటాననడం సిగ్గుచేటని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. కరకట్ట మీద ఉన్న ఇల్లు గురించి ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మొండికేస్తూ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని మంత్రి అనిల్ కుమార్ దుయ్యబట్టారు.
ఏపీ రాష్ట్రం వర్షాలతో సుభిక్షంగా ఉంటే చంద్రబాబుకి ఏడుపు ఆగటం లేదట.. పనిలో పనిగా బీసీలపై చంద్రబాబు పార్టీ చేస్తున్న విమర్శలకు కూడా మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బీసీల మీద మళ్లీ బాబుకి దొంగప్రేమ పుట్టుకొచ్చిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. బాబు అధికారంలో ఉంటే బీసీలు బిజినెస్ క్లాస్ అని, ప్రతిపక్షంలో ఉంటే బ్యాక్ వర్డ్ క్లాస్ అంటారని.. ఆయనకు దమ్ముంటే బీసీలకు ఏం చేశాడో లెక్క తీయాలని అనిల్ కుమార్ సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రిగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణం చేశాక, బీసీలకు ఎన్ని సంక్షేమ పధకాలు చేపట్టారో తాము లెక్క చెబుతామని.. చంద్రబాబు ఏం చేశారో చెప్పలగలరా అంటూ నిలదీశారు అనిల్ కుమార్. బీసీల గురించి బాబు మాట్లాడం సిగ్గు చేటు అంటున్న అనిల్... పచ్చ పత్రికలలో పిచ్చి రాతలు రాయించుకోవడం తప్ప బాబు మళ్లీ అధికారంలోకి రావడం కలని తేల్చి చెప్పేశారు.