వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన బెంగళూర్ లో వెలుగు చూసింది. గోవాకు చెందిన ఓ వ్యక్తి బాడీ గార్డుల తో కలిసివచ్చి వీఐపీలా ఫోజిచ్చి హోటల్ బిల్లు ఎగవేసి ఉడాయించాడు. స్వప్నిల్ నాయక్ గా గుర్తించిన నిందితుడు తాను బస చేసిన హోటల్కు చెల్లించాల్సిన రూ 1.4 లక్షల బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు. నాయక్ తన బాడీ గార్డులను కూడా మోసగించినట్టు వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయక్ ఈనెల 2న గాంధీ నగర్లోని జియోన్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. పలుకుబడి ఉన్న వ్యక్తిలా పోజ్ కొట్టాడు. అది నిజమే అని నమ్మిన హోటల్ వాళ్ళు అతనికి ఘనంగా అతిథి మర్యాదలు చేశారు..
తర్వాత జనవరి 8న నాయక్ భార్య సైతం హోటల్కు రాగా బాడీగార్డుల కోసం మరో రెండు రూములు తీసుకున్నారు. మరుసటి రోజు వారు ఓ మినీబస్ను మాట్లాడుకుని రామనగర టూర్కు వెళ్లారు. ఆపై హోటల్ బిల్లు చెల్లించకుండా భార్యా భర్తలు పరారయ్యారు. మినీబస్ కంపెనీకి, తన బాడీ గార్డులకూ డబ్బు చెల్లించకుండా నిందితుడు మోసగించినట్టు తెలిసింది. భోజనం, లాడ్జింగ్ కోసం నిందితుడు తమకు రూ. 1,43,243 చెల్లించాలని హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ ను మోసగించిన నాయక్ ను పోలీసులు పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు..