పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే పోరాడుతున్నాయి. సాధ్యమైన మేర ఏకగ్రీవాలు చేసుకుని, అన్నీ స్థానాల్లో సత్తా చాటాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తుంది. అలాగే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి, మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రతిపక్ష టీడీపీ కష్టపడుతుంది. అయితే రాష్ట్రం మొత్తంలో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీకి ఎక్కువ పంచాయితీలు దక్కడం ఖాయమనే చెప్పొచ్చు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే మెజారిటీ స్థానాలని దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కూడా వైసీపీకే మెజారిటీ పంచాయితీలు దక్కేలా ఉన్నాయి. మొదట నుంచి గన్నవరంలో టీడీపీకి ఆధిక్యత ఉండేది. కానీ ఎప్పుడైతే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్లారో అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన వంశీ...సొంత ఇమేజ్ పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో వంశీ గెలవడానికి కారణం కూడా ఇదే. రాష్ట్రంలో వైసీపీ వేవ్‌ని తట్టుకుని వంశీ గెలిచారు. గెలిచాక టీడీపీతో ఉపయోగం లేదనుకుని వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు.

ఇక పంచాయితీ ఎన్నికల్లో గన్నవరంలో ఎక్కువ పంచాయితీలు వైసీపీ దక్కేలా వంశీ ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నారు. వంశీ వైసీపీ వైపు వచ్చాక గన్నవరంలో టీడీపీ బాధ్యతలు బచ్చుల అర్జునుడు చూసుకుంటున్నారు. అర్జునుడు ఉన్నా సరే నియోజకవర్గంలో టీడీపీకి అంత సీన్ ఉన్నట్లు కనిపించడం లేదు. నియోజకవర్గంలో వార్ వన్‌సైడ్ అయ్యేలా కనిపిస్తోంది. వంశీ ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

చాలాచోట్ల టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులు కూడా లేరు. దీంతో వైసీపీకి తిరుగులేదనే చెప్పొచ్చు. గన్నవరంలో దాదాపు 80 శాతం పైనే పంచాయితీలు వైసీపీ ఖాతాలో పడిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. కేవలం వంశీ వల్లే వైసీపీ ఇన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ వచ్చేసింది. ఒకవేళ వంశీ టీడీపీలో ఉంటే పరిస్తితి వేరుగా ఉండేది. ఏదేమైనా గన్నవరంలో వంశీ వార్ వన్‌సైడ్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: