టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌మ‌ను ప‌ట్టించుకోకపోయినా.. ఆయ‌న పుట్టిన వూరు ప్ర‌జ‌లు మాత్రం ఆయ‌న ప‌రువును నిలబెట్టా రు. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారి ప‌ల్లె.. చంద్ర‌బాబు పుట్టిన గ్రామం. కొన్నాళ్లు ఇక్క‌డ రాజ‌కీయం చేసిన చంద్ర‌బాబు త‌ర్వాత‌.. త‌న రాజ‌కీయాల‌ను కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి మార్చుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఇక్క‌డ టీడీపీ విజ‌యం సాధించింది లేదు. కాంగ్రెస్ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంది. త‌ర్వాత వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వ‌రుస‌గా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. తాజాగా ఇక్క‌డ జ‌రిగిన నాలుగో విడ‌త పంచాయతీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సొంత గ‌డ్డ‌పై వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని అనుకున్నారు.

దీనికి త‌గిన‌ట్టుగా ఎమ్మెల్యేచెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అన్నీతానై క‌థ న‌డిపించారు. అయితే.. తాజాగా ఫ‌లితాల్లో నారావారిప‌ల్లె చంద్ర‌బా బుకే జై కొట్టింది. టీడీపీ మ‌ద్ద‌తు దారు ఇక్క‌డ వైసీపీ మ‌ద్ద‌తు దారుపై విజ‌యం సాధించారు. ఇది చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పాలి. జిల్లా మొత్తంగా కూడా వైసీపీ దూకుడు చూపించినా.. ఆఖ‌రుకు బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ వైసీపీ జెండా రెప‌రెప‌లాడినా.. బాబు సొంత గ‌డ్డ‌పై మాత్రం సైకిల్ ప‌రుగులు పెట్ట‌డం వైసీపీకి ఇబ్బందిగానే ప‌రిణ‌మించింది. తుది దశ పంచాయతీ పోరులో నారావారిపల్లిలో టీడీపీ మద్దతుదారు లక్ష్మి, సమీప అభ్యర్థిపై 563 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

 టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారావారిపల్లిలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారనేది వాస్త‌వం. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రస్థాయిలో చంద్రబాబును దెబ్బ కొట్టామని చెప్పుకుంటున్న వైసీపీ తుదిద‌శ పంచాయ‌తీలో ఉన్న‌ ఆయన స్వగ్రామం నారావారిపల్లిపై ప్రత్యేక దృష్టి సారించింది. వైసీపీ మద్దతుదారును గెలిపించుకునేందుకు  తీవ్రస్థాయిలో ప్రయత్నించారు.  అయినప్పటికీ నారావారిపల్లిలో టీడీపీ మద్దతుదారు విజయం సాధించడం గమనార్హం. ఇప్ప‌టికే దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి  సారించింది. అస‌లు ఏం జ‌రిగింది?  లోపం ఎక్క‌డ ఉంది? అనే విష‌యాల‌పై నాయ‌కులు చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి చివ‌రికి ఏం తేలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: