అమరావతి భూముల విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారణకు పిలవడం చూస్తుంటే.. ఇదేదో కక్ష సాధింపు వ్యవహారం అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఇప్పటికే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను హైకోర్టు కూడా కొట్టేసింది. సుప్రీంకోర్టులోనూ ఆ వాదన నిలవలేదు. ఇప్పుడు అదే తరహా ఆరోపణలతో చంద్రబాబును ఇరుకున పెట్టాలనుకోవడాన్ని జనం కక్ష సాధింపు అనే అనుకుంటారు. అదే నిజమైతే.. మళ్లీ చంద్రబాబుకు జనం సానుభూతి దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు..?


నోటీసుల ప్రకారం ఆయన ఈనెల 23న విజయవాడలో విచారణకు హాజరుకావాలి.. హాజరుకానిపక్షంలో అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏంచేస్తారు.. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిరేపుతున్న అంశం.. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని కోర్టులో సవాలు చేయాలన్న యోచనలో  చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. సీఐడీ నోటీసుల వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబును పార్టీ సీనియర్‌ నాయకులు చాలా మంది కలిసి చర్చించారు.


వారితో చంద్రబాబు ఏమన్నారంటే.. “ ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్తోంది. మొదట పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నా వరకూ వచ్చారు. ధైర్యంగా ఎదుర్కొందాం. ఏ తప్పూ చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన పనిలేదు’ అని చంద్రబాబు  అంటున్నారట. చంద్రబాబును కలిసిన వారిలో పార్టీ సీనియర్‌ నాయకులు పయ్యావుల కేశవ్‌, కిశోర్‌కుమార్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి,తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేతలు మచ్చా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవిందకుమార్‌గౌడ్‌, బక్కని నర్సింలు తదితరులు ఉన్నారు.


చంద్రబాబు ఇవాళ ఏలూరు వెళుతున్నారు. కుమారుడు చనిపోయిన విషాదంలో ఉన్న మాజీ ఎంపీ మాగంటి బాబును ఆయన పరామర్శిస్తారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుంటారు. న్యాయనిపుణులతో చర్చించాక.. తదుపరి కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: