కేసీఆర్ తెలంగాణ సీఎం.. జగన్ ఆంధ్రా సీఎం.. ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కానీ.. రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం వస్తే.. కేసీఆర్‌ను ఈ జగన్ ఎదిరించలేరట. ఇప్పటి సీఎం జగనే కాదు.. అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఎదిరించలేదట. వీరిద్దరే కాదు.. అసలు ఏపీకి చెందిన కీలక నేతలెవరూ కేసీఆర్‌ను ఎదిరించలేరట. అందుకు కారణం.. ఆంధ్రా నేతలు హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉండటమేనట. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. తన తాజా కొత్త పలుకులో ఈ పలుకులు పలికారాయన.


జగన్‌ రెడ్డి ఒక్కరే కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించలేరని ఆర్కే అంటున్నారు. వారందరికీ హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని... ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసుకున్న ఖర్మ అని చెబుతున్నారు. నిన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నందున ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యులందరూ అక్కడే స్థిరపడిపోయారని... రాష్ట్రం విడిపోయిన తర్వాత వారంతా ఏపీ రాజకీయాలకు పరిమితమైనా ఆస్తులు, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వచ్చి పోతున్నారని గుర్తు చేస్తున్నారు.


ఇక జగన్ విషయానికి వస్తే.. ఆయనకు  హైదరాబాద్‌లో లెక్కకు మించి ఆస్తులు, భూములు ఉన్నాయట. అందులో కొన్ని బినామీ పేర్ల మీద కూడా ఉన్నాయట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం వస్తే లోటస్‌ పాండ్‌ వద్ద ఉన్న రాజప్రాసాదం వైపు జేసీబీలు కదలవచ్చట. జగన్ బినామీ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదం కూడా ఉందట. అందుకే శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ అవుతున్నా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనడానికి కూడా జగన్‌ సాహసించడం లేదట.


జగన్, చంద్రబాబు వంటి ఆస్తులు ఉన్న నేతలు ఎలాగూ కేసీఆర్‌ను ఎదిరించలేరు కాబట్టి.. రాయలసీమ ప్రజల తరఫున హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు లేని పెద్దమనుషులు ఎవరైనా ఉంటే సమస్య పరిష్కారానికి పూనుకోవాలని సూచిస్తున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. మరి అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: