ఊరుకున్నంత ఉత్తమం లేదు..కాలం కలిసి రాకపోతే..మన వాళ్లూ పగవాళ్లూ అంతా ఒక్కటైపోతారు. అమరావతి రాజకీయాలు పాపం ఇలానే ఉన్నాయి..డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే జగన్ ఒప్పుకోరు..పదవులు సంపాదిద్దాం అంటే క్యాడర్ ఒప్పుకోదు ..ఇలా నడిసంద్రంలో ఉండిపోయిన నాయకుల్లో ఒకరు బొత్స.. ఇంకా కొందరు.. ఆ కథ ఇప్పట్లో తేలేది కాదు..జగన్ కూడా వారికి పైకి తెచ్చేదీ లేదు. ఉంటే ఉండండి పోతే పొండి అన్న రకం ఆయన..అందుకనో ఎందుకనో ఈ వ్యూహాత్మక మౌనం బొత్సది ఆయన అనుచరులదీ కూడా!
రాజకీయంలో ఉద్దండుడు..తెలివైన నేత..బలమైన సామాజికవర్గం..ఇవన్నీ పోయి ఇప్పుడాయన స్తబ్దుగా ఉండిపోయారు. ఆయనే బొత్స సత్యనారాయణ. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన వ్యూహంతో ముందుకు పోగల నేతగా పేరున్నా జగన్ దగ్గర అవేవీ పనిచేయ లేదు. ఆయనకున్న పేరే ఆయన ఉనికికి ప్రమాదం కానుంది. ఒకప్పుడు చంద్రబాబును తిట్టేందుకు బాగా ఉపయోగపడిన బొత్స ఇప్పుడు ఆ పేరే ఎత్తరు. త్వరలోనే జగన్ కు దూరం అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయనకు తగిన ప్రాధాన్యం లేదు. కొడుకు సందీప్ ను ఫోకస్ చేయాలని ప్రయత్నిస్తున్నా ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. భార్య ఝాన్సీ (మాజీ ఎంపీ) ఎప్పటి నుంచో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబంలో ఆయన వ్యవహారాలు నెరపే చిన్న శీను మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. అశోక్ గజపతి రాజు వివాదంలో కూడా ఆయన మాట్లాడింది లేదు.
వాస్తవానికి అశోక్ కు దగ్గరగా వ్యవహరించే నేతల్లో బొత్స ఒకరని టాక్.. ఈ ఓపెన్ టాక్ ను ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తనకు రాష్ట్ర రాజకీయాలు ఇష్టం లేదని, వీలుంటే ఢిల్లీలో పాగా వేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. తదనుగుణంగా వచ్చే ఏడాది ఆయన పెద్దల సభకు పోనున్నారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గం నుంచి పేరున్న నేతగా ఆయన ఉన్నప్పటికీ సొంత పార్టీ పెట్టేంత శక్తి ఆయనకు లేకపోవడం పెద్ద మైనస్.. చిరంజీవితో కలసి నడవలేకపోయానన్న బాధ కూడా ఆయనలో ఉంది. తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నానన్న తృప్తి తప్ప ఆయనలో ఆ కుటుంబానికి ఏం చేయాలేకపో యానన్న బాధ ఉంది. ఓ విధంగా ఆయనే కాదు ఉత్తరాంధ్ర కాపులకు పెద్ద దిక్కుగా ఉండే బొత్స చిరు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలుండేవి కానీ అది సాధ్యం కాలేదు.