తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా సత్తా చాటే మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్‌లో మకాం వేసేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని గెలిపించే బాధ్యత హరీష్...తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో పోటీ చేసే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి...నియోజకవర్గాన్ని రౌండప్ చేసేస్తున్నారు.

ఎక్కడకక్కడే భారీ సభలు పెడుతూ ఓటర్లని ఆకర్షించే పనిలో పడ్డారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి హుజూరాబాద్ ఓటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తూ ముందుకెళుతూనే, మరోవైపు రాజకీయంగా ఈటలని దెబ్బతీసే ఎత్తుగడలు వేస్తున్నారు. హుజూరాబాద్‌లో బలంగా పాతుకుపోయిన ఈటలకు చెక్ పెట్టడానికి హరీష్...వ్యూహం మార్చి ముందుకెళుతున్నారు. మామూలుగానే ఈటలపై హరీష్ వాగ్భణాలు సంధిస్తున్నారు.

అయితే హుజూరాబాద్‌లో ఈటలని హైలైట్ చేయాలని హరీష్ అనుకోవడం లేదు. ఇప్పటికే ఇక్కడ పోరు ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఉంది. ఇలా పోరు జరిగితే ఈటలకే ప్లస్ అవుతుంది. ఆయనపై హుజూరాబాద్ ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉంది. ఇక ఆ సానుభూతిని తగ్గించడానికి హరీష్, టీఆర్ఎస్ శ్రేణుల దూకుడుని తగ్గిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు దూకుడుగా వెళితే అది ఈటలకే ప్లస్ అవుతుంది. అలాగే పోలీసుల బలాన్ని కూడా తగ్గించాలని హరీష్ చూస్తున్నారు. ఎందుకంటే దుబ్బాక ఉపఎన్నికలో పోలీసులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారు రఘునందన్, బీజేపీ శ్రేణులని బాగానే ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కడ టీఆర్ఎస్‌కు మైనస్ అయింది. అందుకే హుజూరాబాద్‌లో పోలీసుల స్పీడ్ తగ్గించాలని చూస్తున్నారు.

అదే సమయంలో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు జరుగుతుందనే విధంగా హరీష్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీని హైలైట్ చేస్తేనే, ఈటల ప్రభావం తగ్గుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడాన్ని ఎత్తిచూపిస్తున్నారు. ఇలా బీజేపీని టార్గెట్ చేస్తూ హరీష్, ఈటలని దెబ్బకొట్టాలని అనుకుంటున్నారు. మరి హరీష్ వ్యూహాలు ఏ మేర వర్కౌట్ అవుతాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: