ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. అసలు యుద్ధమంటేనే అందరికీ నష్టం అనే విషయం తెలిసిందే. అయితే రష్యా ఇక్కడ ఏకపక్షంగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది కాబట్టి.. ఉక్రెయిన్ కే ఎక్కువ నష్టం అని ప్రపంచ దేశాలు అంచనా వేస్తున్నాయి. ఉక్రెయిన్ కి సంబంధించిన కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంటోందనే ప్రకటనల నేపథ్యంలో ఉక్రెయిన్ పై అందరూ జాలి చూపిస్తున్నారు.

కానీ వాస్తవం వేరు. యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోతోంది, భవిష్యత్తును కోల్పోతోంది రష్యా. ఇప్పటికే రష్యాపై ఆర్థిక ఆంక్షలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ పై యుద్ధం మొదలు పెట్టడం రష్యాకు తలకు మించిన భారంగా మారింది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో రష్యా అల్లాడిపోతోంది.

రష్యా కేంద్రంగా జరిగే వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం రష్యాపై ఇతర దేశాలు 5వేలకు పైగా ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షల్లో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవి కావడం విశేషం. ఉత్తర కొరియా, ఇరాన్‌ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలులోకి రావడం మరింత విశేషం.

మల్టీ నేషనల్ కంపెనీలేవీ యుద్ద వాతావరణం కమ్ముకున్న దేశాల్లో వ్యాపారాలు చేయాలనుకోవు. తమ వ్యాపారాలకు కానీ, తమ ఉద్యోగుల భద్రత కోసం కానీ ఆయా కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. యుద్ధం మొదలు పెట్టిన రష్యా విషయంలో కూడా కంపెనీలు ఆలోచిస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. కొన్ని కంపెనీలు రష్యానుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు ప్రకటించాయి.

పలు అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ బ్రాండ్‌ లు రష్యానుంచి మాయం అయ్యాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ స్టోర్లు ఖాళీ అయ్యాయి. ముందు ముందు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందనే అంచనాలున్నాయి. ఉక్రెయిన్‌ కి సేనలు పంపి యుద్ధం చేస్తూనే మరోవైపు చర్చలు కూడా కొనసాగిస్తోంది రష్యా. మూడో దఫా టర్కీ రాయబారం ఫలిస్తుందని అంటున్నారు. ఒకవేళ ఈ రాయబారం ఫలించక యుద్ధమే కొనసాగితే ఉక్రెయిన్ కంటే రష్యా ఆర్థికంగా చితికిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: