రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక మార్పు రాబోయే సంకేతాలు ముందుగానే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆ దిశగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ టూర్. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని సమాచారం. అధికారికంగా రాష్ట్ర అంశాలపై, దర్యాప్తులపై చర్చించేందుకు ఈ పర్యటన జరుగుతుందని చెప్పినా… ఈ సారి పాలిటికల్ టచ్ ఎక్కువగా ఉండబోతుందనే అంచనాలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీలో ఒకదాని తర్వాత ఒకటి స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.
 

ఇప్పటికే దాని సూత్రధారులపై పట్టు బిగిస్తున్న సిట్, ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో విదేశీ లింకులు బయటపడటం, వందల కోట్ల నల్లధనం దేశం దాటి బయటకు వెళ్లి తిరిగి రావడం వంటి అంశాలు పెద్ద ఎత్తున రిపోర్టుల రూపంలో బయటకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్తున్న నారా లోకేష్, అక్కడ కేంద్ర పెద్దలతో క్లోజ్ డోర్ డిస్కషన్స్ జరపబోతున్నారని తెలుస్తోంది. అవినీతి కేసులపై, ముఖ్యంగా లిక్కర్ స్కాం ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసే విషయంలోనే ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ వర్గాల అంచనా. దీనికి సంబంధించి లోకేష్ నూతన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వస్తోంది.



ఇక లిక్కర్ స్కాం మాత్రమే కాదు… ఇసుక మాఫియా, ఇతర స్కాంలపై కూడా దర్యాప్తు నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఒకదాని తర్వాత ఒకటి ప్రజల ముందుకు తీసుకురావాలా? లేక ఒక్కసారిగా బాంబ్ పేల్చాలా? అనే దానిపై కూడా లోకేష్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.రాజకీయంగా ఈ నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో… ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ లోకేష్ భుజస్కంధాల మీదే ఉన్నాయని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి వైసీపీ ఏ చిన్న లోపాన్ని వదిలిపెట్టదు. అందుకే ఢిల్లీలో జరిగే మీటింగ్స్ ఈ సారి అత్యంత కీలకంగా మారబోతున్నాయి.మొత్తానికి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన అంటే కేవలం రాష్ట్ర పరిపాలనా చర్చలు మాత్రమే కాదు… భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే మీటింగ్స్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: