ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్‌ అన్నది మరోసారి రుజువైంది. ముఖ్యంగా తాడిపత్రిలో జేసీలదే పూర్తి ఆధిపత్యం అని చెప్పుకోవాలి. దశాబ్దాలుగా అక్కడ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న జేసీ బ్రదర్స్ కు 2019లో ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. కానీ గడిచిన ఐదేళ్లలో తిరిగి సత్తా చాటుకున్న జేసీ బ్రదర్స్, ఇప్పుడు పెద్దారెడ్డికి ఊరే చూపించడం లేదు. హైకోర్టు ఆదేశాలు చేతబట్టుకున్నా కూడా తాడిపత్రిలో అడుగు పెట్టలేని పరిస్థితి పెద్దారెడ్డికి ఏర్పడింది. ఇటీవల హైకోర్టు నుండి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్న పెద్దారెడ్డి, తన సొంత ప్రాంతమైన తాడిపత్రిలో అడుగు పెట్టాలని సంకల్పించారు. ఒకవైపు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం, మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డికి తాను ఎదురుగా ఉన్నానని చూపించాలనే ఉద్దేశ్యం ఆయనకు ఉంది.
 

అయితే జేసీ బ్రదర్స్ ఎప్పుడూ స్కెచ్‌లతో ముందే ఉండే వారు. అందుకే పెద్దారెడ్డి ఊహించని కౌంటర్ ప్లాన్ వేసి ఆయన అడుగులు ఆపేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం, పోలీసులు బందోబస్తు కల్పించి పెద్దారెడ్డిని ఆయన ఇంటి వరకు తీసుకెళ్లాల్సి ఉండేది. అవసరమైతే ఫోర్స్‌ను కూడా వినియోగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. కానీ అమల్లో మాత్రం పరిస్థితి తారుమారైంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి దిశగా బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు మధ్యలోనే ఆపేశారు. తన దగ్గర కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పెద్దారెడ్డి చూపించినా, ఆయనకు ముందుకు వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. దాంతో పెద్దారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ, చివరికి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.



మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాను వెనకడుగు వేయనని, తన బలాన్ని చూపించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం ప్లాన్ చేశారు. శివుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పేరుతో భారీ స్థాయిలో సభను నిర్వహించి, అనుచరులను సమీకరించారు. ఫలితంగా ఏ వైపు నుంచి గందరగోళం తలెత్తుతుందోనన్న భయంతో పోలీసులు పెద్దారెడ్డిని ఆపేశారు. ఇక, పోలీసులే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశం సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడింది. మొత్తానికి, జేసీ బ్రదర్స్ రాజకీయ శక్తి, వారి స్కెచ్‌లు ఇప్పటికీ తాడిపత్రిలో బలంగా పనిచేస్తున్నాయి. పెద్దారెడ్డి ప్రయత్నం విఫలమైపోవడంతో, జేసీల ఆధిపత్యం మరోసారి స్పష్టమైందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: