లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు పెద్ద షాక్ ఇచ్చినా, ఇప్పుడు ఊరట లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుతో మిథున్ కు తాత్కాలికంగా ఉర‌ట లభించినట్టైంది. మిథున్ రెడ్డి గత కొద్ది వారాలుగా సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ కేసులో ఆయనను ఏ-4గా చూపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు. దీంతో ఆయన భవిష్యత్తు రాజకీయ పయనంపై పెద్ద ప్రశ్నార్థకం తలెత్తింది. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడటంతో, ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డిమాండ్‌తో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు.


ఈ పిటిషన్‌పై వాదనలు గత వారం ఏసీబీ కోర్టులో పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన జేడీ రాజేంద్రప్రసాద్, అమృత్‌పాల్ సింగ్ కేసు ఉదాహరణగా చూపుతూ, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, కాబట్టి మిథున్ కు ప్రత్యేకంగా బెయిల్ అవసరం లేదని వాదించారు. అయితే న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, చివరికి 7వ తేదీన తీర్పు వెలువరించింది. తీర్పు ప్రకారం, మిథున్ కు బెయిల్ అనుమతిస్తూ రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు సమర్పించాలని షరతు విధించారు. అంతేకాకుండా, ఓటు వేసిన తరువాత ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి కోర్టులో సరెండర్ కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ షరతులు పూర్తిచేసిన తరువాతే ఆయన తాత్కాలికంగా జైలు వెలుపల ఉండే అవకాశం ఉంటుంది.



మిథున్ రెడ్డి ఓటు వేయడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే, వైసీపీ ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. దీంతో మిథున్ ఓటు నేరుగా ఎన్డీఏ అభ్యర్థి ఖాతాలో పడనుంది. ఇదే సమయంలో ఆయన బయటకు రావడం వైసీపీ శ్రేణుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద, మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఇరుక్కున్నా, రాజకీయంగా తన ఓటు ప్రాధాన్యం తగ్గిపోకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన ఓటు వేసి, మళ్లీ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యంతర బెయిల్ తీర్పు ఆయనకు, వైసీపీకి చిన్న ఊరటగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: