SIR ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఇది గతంలో జరిగిన సాధారణ సవరణలకంటే పూర్తిగా భిన్నమైన విధానం. ఈసారి కేవలం దరఖాస్తులతో సరిపోదు… అధికారులు ఇంటి తలుపు తట్టి వివరాలు సేకరిస్తారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు ఇది బంగారు అవకాశం. కొత్త ఓటు హక్కు కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం ఇదే. ఇంటింటి సర్వే సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వడం ప్రతి ఓటరుడి బాధ్యత. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో వివరాలు ధృవీకరించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. నిర్లక్ష్యం వహిస్తే పేరు జాబితా నుంచి తొలగిపోవడం ఖాయం.
ఓటర్లు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు .. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే ‘Voter Helpline’ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా పేరు, చిరునామా, పోలింగ్ స్టేషన్ వివరాలు సరిచూసుకోవాలి. నకిలీ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవడం ఉత్తమం. కొత్త ఓటుకు ఫారమ్-6, సవరణలకు ఫారమ్-8, తొలగింపులకు లేదా అభ్యంతరాలకు ఫారమ్-7 ఉపయోగించాలి. నివాసం మారిన వారు తప్పనిసరిగా పాత చోట ఓటును రద్దు చేయించుకోవాలి. లేదంటే ఓటు గల్లంతే! ఈ SIR 2025 ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా హేతుబద్ధీకరణ కూడా జరగనుంది. ప్రజాస్వామ్యంలో ఓటే శక్తి. ఆ శక్తిని కోల్పోకుండా కాపాడుకోవాలంటే ప్రతి పౌరుడు ఈ సవరణలో చురుగ్గా పాల్గొనాల్సిందే. లేదంటే… మీ ఓటు మీకే దూరమవుతుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి