గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం సరికొత్త ఎరను సిద్ధం చేస్తోంది. అక్కడ నివసించే దాదాపు 57 వేల మంది పౌరులను ప్రలోభపెట్టేందుకు భారీ నగదు ఆఫర్ ప్రకటించాలని యోచిస్తోంది. డెన్మార్క్ నుండి విడిపోయి అమెరికాలో చేరేందుకు మొగ్గు చూపే ప్రతి పౌరుడికి 10 వేల డాలర్ల నుండి లక్ష డాలర్ల వరకు నేరుగా అందజేయాలని చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం సుమారు ఆరు బిలియన్ డాలర్ల నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఈ భారీ నగదు బహుమతి ద్వారా స్థానిక ప్రజల మద్దతు కూడగట్టి, డెన్మార్క్ పై ఒత్తిడి తీసుకురావాలన్నది ట్రంప్ అసలు వ్యూహం. ఒకవేళ కొనుగోలు సాధ్యం కాకపోతే 'కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్' (COFA) అనే ఒప్పందం ద్వారా ఆ ప్రాంతాన్ని అమెరికా రక్షణ నీడలోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.
వ్యూహాత్మక ప్రాధాన్యత విషయానికి వస్తే, గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు చెందిన 'పిటుఫిక్ స్పేస్ బే' (గతంలో థూల్ ఎయిర్ బే) ఉంది. ఇది క్షిపణి హెచ్చరికలు మరియు అంతరిక్ష నిఘాకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కేంద్రం. అంతేకాకుండా గ్రీన్లాండ్ గర్భంలో దాగి ఉన్న అరుదైన ఖనిజాలు, రాగి, లిథియం మరియు కోబాల్ట్ వంటి నిక్షేపాలు అమెరికా ఆర్థిక భద్రతకు కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడుతున్న అమెరికా, గ్రీన్లాండ్ ద్వారా ఆ డిపెండెన్సీని తగ్గించుకోవాలని చూస్తోంది. ఆర్కిటిక్ మంచు కరుగుతున్న కొద్దీ అందుబాటులోకి వచ్చే కొత్త నౌకాయాన మార్గాలపై పట్టు సాధించడం కూడా ఈ ప్రణాళికలో ముఖ్యమైన భాగం.
అయితే ట్రంప్ తీసుకుంటున్న ఈ దూకుడు చర్యలపై యూరప్ దేశాలు మరియు నాటో మిత్రపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డెన్మార్క్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను మొదటి నుండి తిరస్కరిస్తూనే ఉంది, గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని స్పష్టం చేసింది. అటు గ్రీన్లాండ్ ప్రధాని కూడా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని, ఇలాంటి విలీన ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. శాంతియుత మార్గాల ద్వారా ఇది సాధ్యం కాకపోతే సైనిక శక్తిని ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమని వైట్ హౌస్ వర్గాలు చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. రాబోయే రెండు నెలల్లో గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచం మొత్తం అగ్రరాజ్యం వైపు ఆసక్తిగా చూస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి