మహిళల ప్రీమియర్ లీగ్ లో అయిదు జట్లుగా పాల్గొనగా లీగ్ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు జట్లు మాత్రమే టైటిల్ సాధించడానికి అర్హత సాధిస్తాయి. అందుకోసం అయిదు జట్లు హోరా హోరీగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఆడిన అయిదు మ్యాచ్ లను గెలుచుకుని ప్లే ఆఫ్ కు అర్హత సాధించగా.. మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్యన పోటీ ఉండనుంది. ప్రస్తుతం ఈ నాలుగు జట్లు ఉన్న స్థానాలను చూస్తే, మెగ్ లానింగ్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్ లలో 4 గెలిచి ఎనిమిది పాయింట్ లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

అలీషా హీలీ నేతృత్వంలోని యూపీ వారియర్స్ ఇప్పటి వరకు అయిదు ఆడగా, రెండింట మాత్రమే గెలిచి మూడవ స్థానంలో ఉంది. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన గుజరాత్ జయింట్స్ ఆడిన 6 మ్యాచ్ లలో 2 మాత్రమే గెలిచి నాలుగు పాయింట్ లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఎంతోమంది అభిమానులు కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ప్రదర్శన మరీ దారుణం అని చెప్పాలి. ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందన్న కెప్టెన్ గా ఉన్న ఈ జట్టు ఆశించిన మేరకు ఆడలేకపోతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడగా కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

దీనితో మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ బాగానే ఉంది. అయితే క్రికెట్ విశ్లేషకులు ఊహిస్తున్న ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మరియు యూపీ వారియర్స్ లు ఆ స్థానాలను భర్తీ చేసి ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయని చెబుతున్నారు. ఈ రెండు జట్లు పాయింట్ల పరంగానూ మరియు ఆట పరంగానూ మిగిలిన రెండు జట్ల తో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి. అయితే క్రికెట్ లో సంచలనాలు నమోదవ్వడం కొత్తేమీ కాదు. అలాంటి అద్భుతాలు ఏమైనా జరిగి అట్టడుగున ఉన్న రెండు జట్లలో ఏదైనా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: