గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మే డే సందర్భంగా శుభవార్త... వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వారికి భారీ ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధర రూ.214 తగ్గింది. అదేసమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.336 క్షీణించింది. కొత్త రేట్లు మే1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా, గ్యాస్ ధరలు ప్రతినెలా మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతినెల ఒకటో తేదిన గ్యాస్ సిలిండర్ ధర మారుస్తుంటాయి.
తాజా ధరల తగ్గింపు నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ (14 కేజీలు) రూ.583 నుంచి ప్రారంభమౌతోంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.988 నుంచి ఆరంభమౌతోంది. తగ్గిన కొత్త రేటు మే 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు వర్తిస్తుంది.
ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి. నగరాల వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే..ఢిల్లీలో ధర రూ. 744 నుంచి రూ. 611కు దిగొచ్చింది. కోల్కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 839 నుంచి రూ. 774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ. 579కి తగ్గింది. ఇక హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 862 నుంచి రూ. 796కు తగ్గింది.