ఆమె ఒక ఇళ్లల్లో పనిచేసి తమ పొట్ట నింపుకునే ఓ సాధారణ మహిళ. ఆమెకు 8 మంది సంతానం. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయింది. తినటానికి పిడికెడు తిండి గింజలు కూడా లేవు. ఆకలికి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే ఓ పాత్రలో నీళ్ళు పోసి అందులో రాళ్లు నింపి పొయ్యిమీద ఉడికించింది. పిల్లలు అమ్మ ఏదో వండుతుందిని..కడుపునిండా తిందామనే ఆశతో నైనా వారు ఏడుపు మానేస్తారని ఇలా రాళ్లను ఉడికించే ప్రయత్నం చేశానని నిస్సహాయురాలైన తల్లి చెబుతోంది. ఈ హృదయ విదారకమైన ఈ ఘటన కెన్యాలోని మాంబాసా కౌంటీలో గల ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
కిట్సావో అనే మహిళ భర్త గత ఏడాది దోపిడీదారుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఎనిమిది మంది పిల్లలతో కరెంటు మరియు నీళ్లు లేని ఇంట్లో కిట్సావో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉంది. పిల్లల ఏడుపులు విని పొరుగింటి వ్యక్తి వెళ్ళి చూసే సరికి ఆమె రాళ్లు ఉడికిస్తోంది. ఆ దయనీయ స్థితిని ఆ వ్యక్తి మీడియా దృష్టికి తీసుకు వెళ్లడంతో ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. చలించిపోయిన కెన్యా ప్రజలు ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. కిట్సావో కు ఫోన్లు చేసి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని చెబుతున్నారు. దేశ ప్రజలు తన పట్ల ఇంతలా స్పందిస్తారని తాను అనుకోలేదని ఆమె తన ఆనందాన్ని వ్యక్త పరిచింది.