విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేసి, సహాయక చర్యలు అందించాలని ఆదేశించిన ఆయన వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు చేరుకున్నారు. గ్యాస్ బాధితులు చికిత్స పొందుతున్న కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. అనంతరం పలువురు బాధితులతో స్వయంగా మాట్లాడారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్తూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. చాలా ఓపిగ్గా వారి బాధలను విన్నారు. గ్యాస్ లీకైన సమయంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వృద్ధులైన బాధితులను ఆయన పలకరించారు. వారు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారిలో భరోసా నింపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు చేతులెత్తి జగన్కు దండం పెట్టారు.