తెలంగాణలోని నిజామాబాద్‌ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్యం 18 నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న చిన్నారి సెకన్ల వ్యవధిలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు తీవ్ర కడుపుకోతను మిగిల్చింది. వివరాలు చూస్తే...  నిజామాబాద్‌ నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోని శివమ్‌ అపార్ట్‌మెంట్లో ఓ వ్యక్తి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇక వాచ్ మెన్ కావడంతో అతనికి అపార్ట్‌మెంట్లోనే సెల్లార్ లో ఓ గది ఇచ్చారు. దీంతో అతడు సెల్లార్ లో ఉన్న గదిలో భార్య, అతని 18 నెలల పాపతో నివాసం ఉంటూ విధులు నిర్వరిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం అపార్ట్‌మెంట్ లోని ఓ వ్యక్తి బయటకు వెళ్దామని కారును బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఘోరం జరిగిపోయింది .సెల్లార్ లో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి మనస్వి  నేరుగా వెళ్లి  కారు ముందుకు నిలబడింది. అయితే కారు నడిపే వ్యక్తి విషయం గమనించకుండా కారును ముందుకు నడపగా పాప కారు చక్రాల కింద పడి చనిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటివరకు కళ్ళెదుటే ఆడుకున్న చిన్నారి అలా కారు కింద పడి చిద్రమవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక ఘటనపై నిజామాబాద్‌ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  కాగా సదరు వ్యక్తి కారులోకి ప్రవేశించాక చిన్నారి కారు ముందుకు వెళ్ళింది. అయితే కారులో కూర్చున్న వ్యక్తికి ముందున్న చిన్నారి కనిపించలేదు. దీంతో  అతడు అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో కారు కుడి వైపు గల ముందు, వెనుక రెండు చక్రాలు చిన్నారి పైనుండి వెళ్లడంతో, చిన్నారి అక్కడిక్కడే చనిపోయింది. అయితే చాలా సందర్భాల్లో కారును వెనక్కు తీసుకున్న సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: