ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెనాల్టీలు వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకతుంది. ఈమేరకు ప్లాస్టిక్ వ్యర్దాల నిర్వహణా నిబంధనల్లో సవరణలు తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించేవారే వ్యయాన్ని భరించాలన్న సూత్రం ఆధారంగా పెనాల్టిలు వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానా వేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

 
పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి , విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీలపైనా దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి పెట్టాలని ఏపీ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా 50 వేల రూపాయలు, రెండోమారు 1 లక్ష జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఇకపై ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు స్టాక్ చేసినా పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో 25-50 వేలు జరిమానా తో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాయల చొప్పున పెనాల్టీ విధిస్తారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్  క్యారీబ్యాగ్ ల వినియోగిస్తే  2500 నుంచి 5 వేల రూపాయల జరిమానా విధిస్తారు. దుకాణాలు, సంస్థలు, మాల్స్ లాంటి చోట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయిస్తే 20 వేల నుంచి 40 వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

 
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల రవాణా చేస్తే 25 వేల నుంచి 50 వేల జరిమానా వేయాలని  ఎస్ఈబీ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ల కు ఏపీ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ఈ మేరకు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: