నూటికి నూరు శాతం ఫేక్ వీడియోను సృష్టించి తనపై తప్పుడు ప్రచారం చేశారన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసునని, పోలీసుల విచారణలో అది ఫేక్ వీడియో అని రుజువైందని అన్నారు. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్ర అంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల కుట్ర భగ్నమైందని.. తనను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించడంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. తన వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ ఫిర్యాదు చేశారన్న అనంతపురం ఎస్పీ.. ఆ తర్వాతే దర్యాప్తు చేపట్టామన్నారు.
ఆ తర్వాత ఢిల్లీలో ఈ అంశంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఇది మార్ఫింగ్ వీడియో అని ఆ రోజే చెప్పానని.. వంద శాతం టీడీపీ నేతలు ఒక ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని ముందు నుంచి చెబుతున్నానని అన్నారు. ఒక డెప్త్ టెక్నాలజీని వాడి ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించారన్న మాధవ్.. కొంత మంది దుర్మార్గులు చేసిన పని అని వారిపై మండిపడ్డారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, నారా లోకేశ్లను బండ బూతులు తిట్టిన మాధవ్.. వీడియోలో కాదని.. స్వయంగా తన ఒరిజినల్ చూపిస్తానంటూ మండిపడ్డారు.