పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ, వ్యవసాయ శాఖలతో మంత్రి అచ్చెన్నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి వసుంధరా సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ డోలీలతో రోగులను మోసే దుస్థితి ఉండకూడదని మంత్రి దృఢ సంకల్పం వ్యక్తం చేశారు. రెండేళ్లలోపు జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి డోలీ రహిత జిల్లాగా మార్చాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఆటో, అంబులెన్స్ వెళ్లేలా రహదారులు తప్పనిసరిగా నిర్మించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 200కు పైగా గ్రామాలకు కొత్త రోడ్లు వేశామని అచ్చెన్నాయుడు వివరించారు. మిగిలిన 284 గ్రామాల్లో కూడా రెండేళ్లలోపు రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతుల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. గిరిజనుల ఆరోగ్యం, విద్య, రవాణా సౌకర్యాలు మెరుగుపడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

వ్యవసాయ రంగంలో ప్రకృతి విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. అదనంగా లాభసాటి వాణిజ్య పంటల గురించి రైతులకు అవగాహన కల్పించి, మార్కెట్ అవకాశాలు సృష్టించాలని సూచించారు.

జిల్లాలోని రైతు సంఘాలతో సమన్వయం పెంచి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.ఈ సమీక్ష ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపిరి పోసినట్టయింది. రహదారులు, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ దృశ్యం మళ్లీ కనిపించకూడదన్న ఆయన సత్సంకల్పం జిల్లా అధికారుల్లో ఉత్సాహం నింపింది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: