కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఇప్పుడు పార్టీ దృష్టి తెలంగాణ వైపు మళ్లినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించేందుకు ఢిల్లీ హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకున్నట్లే, తెలంగాణలో కూడా అదే విధంగా “మొత్తం మంత్రి వర్గాన్ని రీషఫిల్ చేయాలి” అనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా క్యాబినెట్‌లో ఉన్న అసంతృప్తి, ప్రాంతీయ సమీకరణలు, సామాజిక సమతుల్యత అంశాలు అన్నీ కలిపి పార్టీ కొత్త హోదాల్లో కొత్త ముఖాలను ప్రవేశపెట్టాలని హైకమాండ్ భావిస్తున్న‌ట్టు సమాచారం.


విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది పూర్తయితే కాంగ్రెస్‌లో పెద్ద మార్పు అవుతుంది. సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి, ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన హైకమాండ్‌లో నడుస్తోందని ప్రచారం. ఇది జరిగితే కాంగ్రెస్‌లో మొదటిసారిగా భర్త - భార్య స్థాన మార్పు అయిన‌ట్ల‌వుతుంది. ఇక మంత్రి శ్రీధర్ బాబును పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ ప్లాన్ కుదరకపోతే, ఆయనకు హోంమంత్రి వంటి అత్యంత కీలక బాధ్యతలు ఇవ్వాలని ఢిల్లీ నాయ‌క‌త్వం యోచిస్తోంది.


సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు క్యాబినెట్‌లో నుండి తప్పనిసరిగా ఎగ్జిట్ చూపిస్తారని టాక్ మరింత బలమవుతోంది. వివాదాల్లో ఇరుక్కున్న పొన్నం ప్రభాకర్ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రిపదవి ఖాయం అని అంటున్నారు. పొన్నంకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశమూ ఉందని ప్రచారం జ‌రుగుతోంది. ఫైన‌ల్‌గా 4 నుంచి 5 మంది  మంత్రులు బయటకు వెళితే... కొత్తగా 4 నుంచి 6 మంది క్యాబినెట్‌లోకి వ‌స్తారంటున్నారు. ఈ మార్పులు నిజమైతే తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పెను సునామీ తప్పదు. పార్టీలో గ్రూపుల గోల మ‌రింత ఎక్కువ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: