రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులకు అనూహ్యంగా కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ అటాక్ చేస్తోంది. తాజాగా భారతదేశంలో కూడా చిన్నారుల్లో నూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్తో పోలిస్తే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన చిన్నారుల్లో ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కడుపు నొప్పి రావడం సహా వాంతులు అవుతున్న చిన్నారులకు పరీక్షలు జరుపగా వారికి కరోనా పాజటివ్ అని తేలుతోంది. వారిలో జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే, చాలామంది తల్లిదండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా చూస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందించడం ద్వారా కొందరిలో వైరస్ తగ్గిపోతోంది. మరికొందరు మాత్రం వైద్యుల సంప్రదించగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో చాలా వరకు కరోనా నిర్ధారణ అవుతున్నట్టు తెలుస్తోంది. డెల్టా వేరియంట్లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు వెలుగు చూశాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయిదుగురు చిన్నారులు కరోనా భారిన పడ్డారు. వీరికి సికింద్రబాద్లోని గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు పిల్లలకు ఆక్సిజన్తో చికిత్స చేస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని వైద్యులు చిన్నారుల తల్లదండ్రులకు సూచిస్తున్నారు.