కర్మ సినిమాతో నటుడిగా పరిచయమైన యువ హీరో అడివిశేష్, ఆ సినిమాతో ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. వాస్తవానికి అంతకముందు శ్రీను వైట్ల తీసిన సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో కొన్ని క్షణాలు మెరిసిన శేష్, ఆ తరువాత కర్మ మూవీకి కథను కూడా తానే అందించి నటించారు. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేస్తూ వచ్చిన శేష్, 2016లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై తెరకెక్కిన క్షణం సినిమాతో హీరోగా మారి దానితో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు. తరువాత గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కిన సినిమాల్లో నటించి హీరోగా భారీ విజయాలు అందుకున్నారు.

ఇక ప్రస్తుతం గూఢచారి 2, అలానే మేజర్ సినిమాల్లో నటిస్తున్నారు శేష్. ఓవైపు నటిస్తూ మరోవైపు తన సినిమాలకు తానే రచన చేస్తూ కొనసాగుతున్న శేష్, ఈ రెండు సినిమాలతో కూడా విజయాలు అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే వీటిలో మేజర్ సినిమా గురించి మాట్లాడుకుంటే, దీనిని సూపర్ స్టార్ మహేష్ సొంత సంస్థ అయిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ మూవీస్ వారితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ సినిమాకి శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.

ద్విభాషా సినిమాగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండర్ మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర పోషిస్తున్నారు అడివి శేష్. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక అప్ డేట్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన దబాంగ్ 3 సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సాయి మంజ్రేకర్ ని తమ సినిమాలోని ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకుంటున్నట్లు యూనిట్ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకు సాయి మంజ్రేకర్ గ్లామర్ కూడా తోడవడం మరింత ప్లస్ పాయింట్ అని అంటున్నారు విశ్లేషకులు ......!!

మరింత సమాచారం తెలుసుకోండి: