ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోలు అంతా నెమ్మదిగా తమ పెండింగ్ సినిమాల షూటింగ్ లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. అయితే రానా దగ్గుబాటి మాత్రం ఓటీటీ ఇంటర్వ్యూలలో యూట్యూబ్ వీడియోలలో బిజీగా ఉంటున్నాడు కాని తన పెండింగ్ సినిమాల షూటింగ్ ను పూర్తి చేసే విషయంలో ఇంకా ఆశక్తి కనపరచడం లేదు అన్నవార్తలు వినిపిస్తున్నాయి.


సుమారు 18 నెలలుగా రానా తన అనారోగ్య సమస్యల రీత్యా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమధ్య సమంత ఆహా ఛానల్ లో హోస్ట్ చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి అతిధిగా వచ్చిన రానా తనకు వచ్చిన ఆరోగ్య సమస్యల గురించి వాస్తవాలు బయటపెట్టాడు. తనకు వచ్చిన హై బ్లడ్ ప్రెషర్ వల్ల తనకు ఏర్పడిన కిడ్నీ సమస్యల గురించి వివరిస్తూ అప్పట్లో తన అనారోగ్య సమస్యల చికిత్స కోసం అమెరికా వెళ్ళునప్పుడు తనకు చికిత్స చేసే వైద్యుడు 30 శాతం తన ప్రాణానికి ముప్పు ఉందని అదేవిధంగా 70 శాతం తనకు పెరాల్సిస్ వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు తాను పడ్డ మానసిక వ్యధను గుర్తుకు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైనప్పుడు రానా మాటలు విని సమంత కన్నీరు పెట్టుకుంది.


ఇప్పుడు రానా సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయి పెళ్ళి కూడ చేసుకున్న జోష్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ తన సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ షూటింగ్ లు అంటే భయపడి పోతున్నట్లు టాక్. రానా ప్రస్తుతం నటిస్తున్న ‘విరాటపర్వం’ మూవీకి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ దట్టమైన అరణ్యాలలో షూట్ చేయవలసి ఉంది. రానా అంగీకరిస్తే ఈమూవీ షెడ్యూల్ ను ఫారెస్ట్ ఏరియాలో తీయాలని నిర్మాతలు ఎన్ని సార్లు ప్రయత్నించినా రానా నుంచి ఇంకా పూర్తి గ్రీన్ సిగ్నల్ రాలేదు అంటున్నారు.


ఈ విషయాలు సురేష్ బాబు దృష్టి వరకు వెళ్ళడంతో ఆయన ఈ మూవీ దర్శక నిర్మాతలను పిలిపించి ఈ మూవీ షూటింగ్ కోసం స్టూడియోలోనే ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తే రానా వెంటనే షూటింగ్ కు వస్తాడని చెప్పినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. అయితే ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ను క్రియేట్ చేయడం ఆ తరువాత డానికి సంబంధించి గ్రాఫిక్ వర్క్స్ చేయడం ఖర్చుతో కూడిన పని అయినా మరో మార్గం లేక సురేష్ బాబు సూచనలను పాటిస్తున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: