సూపర్ స్టార్ మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తుండగా జగపతి బాబు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఈపాటికి ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ ఇటీవల మహేష్ కరోనా బారిన పడడం, అలానే అయన అన్నయ్య రమేష్ బాబు హఠాత్తుగా మరణించడంతో ఆ షెడ్యూల్ ని కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి ఫిబ్రవరి 14న తొలి సాంగ్ విడుదల చేయబోతున్నట్లు మొన్న థమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. అయితే ఈ మూవీ సాంగ్స్ గురించి నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా థమన్ మాట్లాడుతూ, మేము సర్కారు వారి పాట సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కారణం ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితుల వలన తరచు షూటింగ్ వాయిదా పడడమే అని, అలానే ఈ పరిస్థితుల్లో అందరూ తమ సినిమాలని పక్కాగా ఎపుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు.

ఒకవేళ మేము ఇప్పటికిప్పుడు వరుసగా సర్కారు వారి పాట సాంగ్స్ రిలీజ్ చేస్తే, ఆ తరువాత సినిమా రిలీజ్ కి ఏమైనా అడ్డంకులు ఏర్పడి మూవీ మరింతగా ఆలస్యం అయితే సాంగ్స్ యొక్క ఫీల్ మిస్ అవుతుందని, పెనం వేడి మీద ఉన్నప్పుడే దోశ వేసేయాలి అనే మాదిరిగా, సాంగ్స్ రిలీజ్ తరువాత మూవీ కూడా పెద్దగా గ్యాప్ లేకుండా వెంటనే రిలీజ్ అయితే సాంగ్స్ తో పాటు మూవీ కూడా ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఇకపై వరుసగా సర్కారు వారి పాట నుండి అప్ డేట్స్ వస్తాయని, తప్పకుండా ఈ సాంగ్స్ తన కెరీర్ లో అలానే మహేష్ కెరీర్ ల పెద్ద చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయం అని థమన్ అన్నారు. కాగా సర్కారు వారి పాట సినిమాని ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: