ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన టెర్రర్ దాడి (26 మంది అమరులు) తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఈ విషాదం జరిగిన కొద్ది రోజులకే, పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. మన భారత సైన్యంపై, మీడియాపై నోరు పారేసుకున్నాడు. ఈ అవమానకర వ్యాఖ్యలపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు.

27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన అఫ్రిది, ఓ టీవీ షోలో మాట్లాడుతూ భారత సైన్యం చేతకానిదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "కశ్మీర్‌లో మీకు 8 లక్షల మంది సైన్యం ఉంది కదా, అయినా ఈ దాడి జరిగింది. అంటే మీరు అసమర్థులు, పనికిరాని వాళ్లు. మీ సొంత ప్రజలనే మీరు కాపాడుకోలేకపోయారు" అని అన్నాడు. అంతటితో ఆగకుండా, ఈ దాడిపై భారత మీడియా స్పందించిన తీరును కూడా ఎద్దేవా చేశాడు.

"దాడి జరిగిన గంటకే వాళ్ల మీడియా బాలీవుడ్‌ సినిమాలా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను. దయచేసి, ప్రతీదాన్ని డ్రామాగా మార్చకండి" అని హితవు పలికాడు. ఇంకా మాట్లాడుతూ, "నిజానికి వాళ్ళ రియాక్షన్లు చూసి నేను ఎంజాయ్ చేశాను. వాళ్లు చదువుకున్న వాళ్లం అంటారు, కానీ వాళ్ల మైండ్‌సెట్ చూడండి" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా 'గబ్బర్' శిఖర్ ధావన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. "కార్గిల్‌లో మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించాం. ఇప్పటికే చాలా దిగజారిపోయావ్. ఇంకా ఎంత కిందకు పోతావ్? ఇలాంటి పనికిమాలిన కామెంట్లు చేయడం మానేసి, నీ దేశాన్ని బాగు చేసుకోవడానికి నీ బుర్రను ఉపయోగించు. మా భారత సైన్యం పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం. భారత్ మాతా కీ జై, జై హింద్." అంటూ ధావన్ ఘాటుగా పోస్ట్ పెట్టాడు.

శిఖర్ ధావన్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లైకి భారత అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. మన సైనిక దళాలకు మద్దతు తెలుపుతూ కామెంట్లు వెల్లువెత్తాయి. టెర్రర్ దాడితో పాటు, అఫ్రిది చేసిన అవమానకర వ్యాఖ్యలతో రగిలిపోతున్న ఎంతో మంది భారతీయుల ఆగ్రహాన్ని, దేశభక్తిని, సైన్యం పట్ల గర్వాన్ని ధావన్ మాటలు ప్రతిబింబించాయని నెటిజన్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: